చోరీ కేసులో క్లూస్ టీమ్తో విచారణ
లక్కిరెడ్డిపల్లి : మండలంలోని దప్పేపల్లి గ్రామం, గల్లావాండ్లపల్లికి చెందిన గల్లా వీరాంజనేయులు ఇంటిలో గుర్తు తెలియని దొంగలు పడి బంగారు నగలతోపాటు నగదును అపహరించుకుపోయినట్లు శుక్రవారం రాత్రి లక్కిరెడ్డిపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు శనివారం ఉదయం క్లూస్ టీమ్తోపాటు డాగ్ స్క్వాడ్తో కలిసి చోరీ జరిగిన ప్రాంతంలో తనిఖీ చేపట్టినట్లు లక్కిరెడ్డిపల్లి ఎస్ఐ డి.శోభ తెలిపారు. బాధితుడిని విచారించగా 19 తులాల బంగారు నగలు ఉన్నట్లు చెప్పారు. వీటిలో నాలుగు తులాలు దొంగలు అపహరించుకెళ్లారని గుర్తించినట్లు ఎస్ఐ శోభ తెలిపారు. గల్లా వీరాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
వివాహిత ఆత్మహత్య
రాయచోటి: ఇంటిలో ఎవరూలేని సమయంలో షేక్ రేష్మ (220 చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం రాయచోటి పట్టణం, కొత్తపల్లిలోని పారమండపం వీధిలో అసన్ వలి ఇంటిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. షేక్ అసన్ వల్లితో ఏడు సంవత్సరాల క్రితం రేష్మకు వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు. అసన్ వలి తోపుడు బండి మీద ప్రూట్స్ వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. గత రెండు సంవత్సరాల నుండి ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉండేవని సమీప బంధువులు చెప్తున్నారు. శనివారం ఉదయం భర్త ఇంటి నుండి బయటకు వెళ్లిన తరువాత చీరతో ఐరన్ రాడ్కు ఉరివేసుకొని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
నీటి మడుగులో పడి
వృద్ధ్దుడు మృతి
రాయచోటి : మేకపొతును రక్షించబోయి కాపరి కోటకొండ తిమ్మయ్య (83) నీటి మడుగులో పడి మృత్యువాతపడ్డాడు. రాయచోటి పట్టణంలొని చిత్తూరు రోడ్డు ఫిష్ మార్కెట్ వెనుకాల వంక మడుగులొకి ఒక మేకపోతు దూకింది. దానిని రక్షించడానికి తిమ్మయ్య నీళ్లలోకి దిగి అందులో కూరుకుపోయాడు. మడుగు పూర్తిగా నిండడం, తిమ్మయ్యకు వయస్సు మీరడం వంటి కారణాలతో ఆయన బయటకు రాలేక మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. రూరల్ మండల పరిధిలొని యండపల్లి గ్రామం, కురబపల్లికి చెందిన తిమ్మయ్య ఐదు సంవత్సరాల నుంచి మటన్ షాపు నిర్వహిస్తున్నాడు. సుబ్బయ్య పొటేళ్లు, మేకపోతులను మేపడానికి తీసుకెళ్లాడు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో తిరుగు ప్రయాణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. విషయాన్ని స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. శనివారం ఉదయం నీటిని తోడి ఊబిలోపల చిక్కుకుపోయిన తిమ్మయ్యను బయటకు తీశారు. మృతునికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం
గోపవరం :శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు నుంచి భక్తులు ట్రాక్టర్లో మండలంలోని మల్లెంకొండకు వెళుతుండగా శనివారం సూరేపల్లె వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి ఒకవైపుకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో భక్తులకు ప్రమాదం జరగలేదు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని భక్తులు తెలిపారు.
బడ్జెట్లో గ్రంథాలయాలకు నిధులు కేటాయించాలి
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిపార్ట్మెంట్ వారీగా కేటాయించిన బడ్జెట్లో జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగులకు జీతాల కోసం రూ.36.34 కోట్ల మాత్రమేనని కేటాయించారని దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాదెండ్ల బాబ్జిలు అన్నారు. రెండేళ్ల నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ 20 కోట్ల రూపాయలు కాగా ప్రతి నెలకు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు సుమారుగా 10 కోట్ల రూపాయలు అవసరంగా ఉందన్నారు. ఈ ఏడాది జులై మాసానికి మరో 25 మంది రెగ్యులర్ ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నారని వీరికి చెల్లించాల్సిన బెనిఫిట్స్ మరో రూ.15 కోట్లు అదనపు భారం పడే అవకాశం ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ 150 కోట్లు అవసరం కాగా ప్రభుత్వం రూ. 36.30 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందన్నారు.


