104 వాహనాల కేసులో పురోగతి సాధించాం
రాయచోటి : అన్నమయ్య జిల్లాలో 104 వాహనాల దోపిడీ కేసులో పురోగతి సాధించినట్లు రాయచోటి అర్బన్ సీఐ బీవీ చలపతి తెలిపారు. శనివారం రాయచోటి అర్బన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు పురోగతి విషయాలను వివరించారు. రాయచోటి మున్సిపాలిటీలో ఎఫ్–1 శానిటరీ ఇన్చార్జ్ అధికారి నరసింహులు, శివప్రసాద్లతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసి మరింత సమాచారం కోసం విచారణ కొనసాగిస్తున్నామన్నారు. రాయచోటి ఏరియా ఆసుపత్రి ఆవరణలో శిథిలావస్థ పీసీలో ఉన్న నాలుగు 104 వాహనాలను జిల్లా డీఎంహెచ్ఓ ఏరియా ఆసుపత్రి సూపరిటెండెంట్ల మౌఖిక ఆదేశాల మేరకు నరసింహులు డంపింగ్ యార్డుకు తరలించినట్లు చెప్పారు. వాహనాల తరలింపుకు అవసరమైన నిధులు ఇవ్వకపోవడంతో మాసాపేటకు చెందిన శివప్రసాద్తో కలిసి వాటిని స్క్రాప్ క్రింద లక్షాయాభై వేల రూపాయలకు విక్రయించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. మరిన్ని కోణాలలో విచారించిన అనంతరం నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని సిఐ వివరించారు.


