‘వక్ఫ్’పై పచ్చ కుట్ర
● భూములు అన్యాక్రాంతం చేస్తున్న
నేపథ్యంలో తిరుగుబాటు
● భూముల పరిరక్షణకు చర్యలు
తీసుకోవాలి
● జేసీ శివనారాయణశర్మకు వినతి
సాక్షి అన్నమయ్య : ముస్లిం సమాజ అభివృద్ధికి, పలువురు దాతలు స్వచ్ఛందంగా దానం చేసిన వక్ఫ్భూములను కాజేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అన్నమయ్యజిల్లా వైఎస్సార్ సీపీ మైనారిటీ అధ్యక్షులు బేపారి ఖాదర్ఖాన్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాకు చెందిన ముస్లిం, మైనారిటీ నాయకులతో కలిసి కలెక్టరేట్లో జరుగుతున్న పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వక్ఫ్భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకుముందు పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వస్తూ నినాదాలు చేశారు. కలెక్టరేట్ వద్ద వక్ఫ్ చట్టానికి తూట్లు పొడుస్తున్న చంద్రబాబు సర్కార్ ఇప్పటికై నా కళ్లు తెరవాలని, వక్ఫ్ భూములను రెవెన్యూ పరిధిలోకి తెచ్చి అనుకూలమైన వ్యక్తులకు కట్టబెట్టేందుకు జరుగుతున్నపచ్చకుట్రపై నినదించారు.అనంతరం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఉన్న జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ స్టేట్ మైనారిటీ కార్యదర్శి ఎస్.ఏ.కరీముల్లా, జిల్లా ఉపాధ్యక్షులు రహంతుల్లా, హజ్కమిటీ మాజీ మెంబర్ పుంగనూరు ఖాదర్, రఫీ, మున్సిపల్ వైస్చైర్మన్ నూర్ఆజం, కౌన్సిలర్ బి.ఏ.ఖాజా, పట్టణ మైనారిటీ అధ్యక్షులు యూనస్, నాసిర్, నవాజ్ఖాన్, మహమ్మద్ యాసీన్, సాదిక్, జావిద్, షానవాజ్, నిమ్మనపల్లె నవాజ్ఖాన్, నూర్ మొహియుద్ధీన్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
వక్ఫ్ భూముల అన్యాక్రాంతం తగదు
మంగళగిరిలోని అంజుమన్ ఇ ఇస్లామియా సంస్థకు చెందిన 71.57 ఎకరాలు, మల్లారెడ్డిపాలెంలో 232 ఎకరాల వక్ఫ్భూములను ప్రభుత్వం అన్యాయంగా భూసేకరణ చేసి ఏపీఐఐసీకి ఇచ్చేందుకు ప్రయత్నించడం దుర్మార్గం. ఆన్లైన్ రికార్డుల్లో వక్ఫ్భూమిగా ఉండాల్సిన దాన్ని ప్రభుత్వ భూమిగా మార్పు చేయడం దారుణం. వక్ఫ్భూములు ప్రభుత్వ భూములు కావని, వందల కోట్లు విలువ చేసే వాటిని ప్రభుత్వం ఏపీఐఐసీకి కేటాయించడాన్ని ముస్లిం మైనారిటీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వక్ఫ్భూములను అడ్డగోలుగా స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. వైఎస్సార్ సీపీ పాలనలో ముస్లింలు సుభిక్షంగా ఉన్నారని, కూటమిపాలనలో ముస్లిం సమాజంలో అభద్రతా భావం చోటుచేసుకుంది.
బేపారి ఖాదర్ఖాన్, జిల్లా వైఎస్సార్ సీపీ మైనారిటీ అధ్యక్షులు, అన్నమయ్య జిల్లా


