అన్నమో.. సౌమ్యనాథా!
● అన్నప్రసాదాల పంపిణీకి కేంద్రపురావస్తుశాఖ అడ్డంకి
● ఆకలితో వేలాదిమంది భక్తులు విలవిల
● సౌమ్యనాథాలయానికి పోటెత్తుతున్న భక్తులు
రాజంపేట: దక్షిణభారతదేశంలో అతి పెద్ద వైష్ణవాలయం, చోళుల కాలంలో నిర్మితమైన వైఎస్సార్ కడప జిల్లా నందలూరు సౌమ్యనాథాలయంలో అన్నప్రసాదాల పంపిణీకి కేంద్రపురావస్తుశాఖ అడ్డంకిగా మారిందనే అపవాదును మోదీ ప్రభుత్వం మూటకట్టుకుంది. వేల సంఖ్యలో ప్రతి రోజు ఆలయానికి వచ్చిన భక్తులు ఆకలితో అలమటిస్తున్నారు. కొంతమంది అన్నప్రసాదాల కోసం ఒంటిమిట్టకు వెళుతున్నారు. అలా కాకుండా ఆలయంలోనే అన్నప్రసాదాల కౌంటర్ను ఏర్పాటుచేసి టీటీడీ స్వయంగా నిర్వహించాలనే డిమాండ్ భక్తుల నుంచి వినిపిస్తోంది.
దేవదాయశాఖ ఆధ్వర్యంలో..
సౌమ్యనాథాలయం దేవదాయశాఖ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు స్థానికులు అన్నప్రసాదాల పంపిణీ చేపడుతూ వచ్చారు. సౌమ్యనాథ ట్రస్ట్ పేరుతో ఆలయం ఎదురుగా ఉన్న భవనంలో అన్నప్రసాదాలను పంపిణీ చేసేవారు. ఈ భవనం ఏర్పాటుకు రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి దాతగా నిలిచిన సంగతి విదితమే. దాతల నుంచి వచ్చే మొత్తాలతో భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ జరిగేది. ఇప్పటికే ఈ ట్రస్ట్ నిధులు రూ.కోటి దాటిపోయినట్లు సమాచారం. అలాగే స్థానిక వైఎస్సార్సీపీ కాపునాయకుడు అరిగెల సౌమిత్రి సౌమ్యనాథాలయ చైర్మన్గా ఉన్నప్పుడు దాతల సహకారంతో ఆలయంలో భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేస్తూ వచ్చారు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులకు ఆకలి అనే మాట లేకుండాపోయింది.
టీటీడీలోకి విలీనం తర్వాత..
సౌమ్యనాథాలయాన్ని టీటీడీలోకి విలీనం చేసిన తర్వాత బయటి వ్యక్తులు అన్నప్రసాదాలను పంపిణీ చేయడానికి వీలులేదన్నారు. దీంతో అప్పట్లో ఆలయంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. అన్నప్రసాదాలు పంపిణీ చేయడానికి అనేక మంది దాతలు ఉన్నారు. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం స్వాగతించాల్సిన ఆవశ్యకత ఉంది.
● తిరుమల తిరుపతి దేవస్థానం నందలూరు సౌమ్యనాథాలయంలో అన్నప్రసాదాల పంపిణీ ఒక పూట చేయాలనే సంకల్పంతో ముందుకొచ్చినట్లు సమాచారం. అయితే దీనికి కేంద్రపురావస్తుశాఖ అడ్డంకులు సృష్టిస్తోందని భక్తులు వాపోతున్నారు. ఇప్పటికే టీటీడీ ఉన్నతాధికారి ఒకరు కేంద్ర పురావస్తుశాఖకు అన్నప్రసాదాల పంపిణీకి అనుమతి ఇవ్వాలని కోరినట్లు టీటీడీ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఇప్పటి వరకు అనుమతులు రాకపోవడంతో టీటీడీ ఏమీ చేయలేని నిస్సహాయస్ధితిలో పడిపోయింది. ప్రతి శనివారం సౌమ్యనాథాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల నుంచే కాకుండా అనంతపురం, కర్నూలు, చిత్తూరుతో పాటు పలు జిల్లాల నుంచి భక్తులు వస్తున్నారు. ఆలయ రహదారి భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. ఈ నెలలో ఇప్పటికే రూ.7లక్షలకుపైగా హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ సిబ్బంది లెక్కవేశారు. పండుగల వేళ కనీసం రోజుకు 2వేల మందికి పైగా భక్తులు వస్తున్నారు. 2022లో నందలూరు సౌమ్యనాథాలయాన్ని టీటీడీలోకి విలీనం చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నప్రసాదాల పంపిణీ జరగలేదు. అనుబంధ ఆలయాల్లో ఈ అంశంపై తాజాగా టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా నందలూరు సౌమ్యనాథాలయంలో కూడా ఒక పూట అయినా అన్నప్రసాదాలను పంపిణీ చేయాల్సి ఉంటుందని అధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.
చోళుల కాలంలో నిర్మించిన దక్షిణభారతదేశంలోనే అతిపెద్ద దేవాలయం నందలూరు సౌమ్యనాథాలయం నందలూరు సౌమ్యనాథస్వామి మూలవిరాట్టు
అన్నప్రసాదాల పంపిణీ చేపట్టాలి
నందలూరు సౌమ్యనాథాలయంలో అన్నప్రసాదాలను పంపిణీ చేయాల్సిన ఆవశక్యత ఇప్పుడు ఎంతైనా ఉంది. స్వామివారిని దర్శించుకునే వారి సంఖ్య వేలల్లోకి చేరుకుంది. ఆలయంలో భక్తుల ఆకలి తీర్చేందుకు టీటీడీ ముందుకురావాలి. ఆ దిశగా ఈవో అనిల్కుమార్ సింఘాల్ చర్యలు తీసుకోవాలి. శనివారం రోజున భక్తుల సంఖ్య అధికంగా ఉంది. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ఆలయంలో అన్నప్రసాదాల పంపిణీ విభాగం ఏర్పాటుచేయాలి. –ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్యే, రాజంపేట
సముచిత నిర్ణయం తీసుకోవాలి
నందలూరు సౌమ్యనాథాలయానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదాలను అందచేయాలి. ఆలయంలో 108 ప్రదక్షణలు చేసేందుకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. వారి ఆకలి తీర్చేందుకు అన్నప్రసాదాల పంపిణీ దోహదపడుతుంది. ఈ విషయంలో టీటీడీ పాలకమండలి సముచిత నిర్ణయం తీసుకోవాలి.
–మేడా రామకృష్ణారెడ్డి, మాజీ డైరెక్టర్, టీటీడీ బోర్డు, నందలూరు
అన్నమో.. సౌమ్యనాథా!
అన్నమో.. సౌమ్యనాథా!
అన్నమో.. సౌమ్యనాథా!


