హైవేలో బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు
● బస్స్టాప్ వద్ద నిలపాలని డిమాండ్
● ఆర్టీసీ డీఎం చొరవతో సమసిన వివాదం
చైన్నై– అనంతపురం హైవేలో నిలిచిన బస్సులు
రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో బస్సులను అడ్డుకున్న ప్రజలు
రొంపిచెర్ల : చైన్నై– అనందపురం హైవేలోని రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో ఆర్టీసీ బస్సులు బస్స్టాప్లో అగడం లేదని, దీని కారణంగా నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు మంగళవారం మధ్యాహ్నం బస్సులను అడ్డుకున్నారు. దీంతో అన్నమ్మయ్య జిల్లా పీలేరు ఆర్టీసీ డీఎం రోషన్ వచ్చి బస్స్టాప్లోనే బస్సులు నిలుపుతామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దు మణిగింది. గత నాలుగు నెలల కాలంలో రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో రోడ్డు దాటుతూ 8 మంది మృతి చెందగా, మరో 10 మంది వరకు గాయ పడ్డారు. దీనికి ఆర్టీసీ డ్రైవర్లు బస్సులను బస్స్టాప్లో అపక పోవడమే కారణమని మండి పడ్డారు. సోమవారం రాత్రి కూడా గుర్తు తెలియని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు గాలిలో కలసి పోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని బస్సులను అడ్డుకున్నారు. సంఘటన స్థలానికి రొంపిచెర్ల పోలీసులు వచ్చి ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చి ఇక్కడికి రావాలని తెలిపారు. డీఎం అప్పటికప్పుడే బస్స్టాప్ వద్దనే బస్సులు నిలపాలని డ్రైవర్లను ఆదేశించడంతో సమస్య సద్దుమణిగింది.
హైవేలో బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు


