ప్రైవేట్ మెడికల్ షాపులో ప్రభుత్వ మందులపై విచారణ
మదనపల్లె రూరల్: ప్రైవేట్ మెడికల్ షాపులో ప్రభుత్వ ఆస్పత్రిలో వినియోగించే మందులు లభ్యం కావడంపై మదనపల్లె డ్రగ్ ఇన్స్పెక్టర్ దాదాఖలందర్ గురువారం విచారణ చేపట్టారు. జిల్లా ఆస్పత్రిలోని డ్రగ్స్టోర్ను పరిశీలించారు. స్టాక్ వివరాలు, వినియోగిస్తున్న మందులపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రైవేట్ మెడికల్ స్టోర్కు వెళ్లి విచారణ చేశారు. ప్రభుత్వ మందులు వారికి ఎలా వచ్చాయనే విషయమై ఆరా తీశారు. ఈ సందర్భంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మందులు ప్రైవేట్ మెడికల్ షాపులో లభ్యం కావడంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేసి నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు.
మదనపల్లె సిటీ: స్టెమ్ ల్యాబ్ విద్యార్థులకు ఎంతో ఉపయోగ పడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం తెలిపారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఫోర్డు సంస్థ ఏర్పాటు చేసిన స్టెమ్ ల్యాబ్ను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి ల్యాబ్ల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలన్నారు. ఫోర్డు డైరెక్టర్ లలితమ్మను అభినందించారు. ఆయన వెంట ఎంఈఓ ప్రభాకర్రెడ్డి, హెచ్ఎం సుబ్బారెడ్డి ఉన్నారు.
మదనపల్లె రూరల్: 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు గురువారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన భద్రతా మాసోత్సవాల బ్యానర్ను జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రహదారులపై ప్రమాదాలను నివారించడం ముఖ్య ఉద్దేశంగా ఏటా రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 1 నుంచి 31వ తేదీ వరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జిల్లా ప్రజలందరూ రహదారుల భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి ప్రసాద్, అశోక ప్రతాప్రావు, ఎంవీఐ దినేష్చంద్ర తదితరులు పాల్గొన్నారు.
వీరబల్లి: వీరబల్లిలోని పోలీసు స్టేషన్ను గురువారం సాయంత్రం రాజంపేటకు చెందిన ట్రైనీ ఏఎస్పీ మనోజ్ హెగ్డే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈయనకు పోలీసు సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏఎస్పీ నూతన ఎస్ఐ సుస్మిత ద్వారా పోలీసు స్టేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కమలాపురం: కమలాపురంలోని పెద్ద దర్గాలో పూర్వ, స్వర్గీయ పీఠాధిపతి జహీరుద్దీన్ షా ఖాద్రి జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పీఠాధిపతి శ్రీ హజరత్ సజ్జాద్–ఏ–నషీన్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి ఆధ్వర్యంలో 150 కేజీల కేక్ కట్ చేసి భక్తులకు పంచి పెట్టారు. స్వామి వారి మజార్లపై పూలచాదర్లు సమర్పించారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సుంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.
ప్రైవేట్ మెడికల్ షాపులో ప్రభుత్వ మందులపై విచారణ
ప్రైవేట్ మెడికల్ షాపులో ప్రభుత్వ మందులపై విచారణ


