శుభ కార్యాలకు విరామం!
మదనపల్లె సిటీ: పెళ్లికి అతి ముఖ్యమైనది ముహుర్తం. బలమైన ముహుర్తంలో వివాహం చేసుకుంటే నూరేళ్ల జీవితం సుఖమయం అవుతుందన్నది అందరి నమ్మకం. అందుకే వివాహ తంతులో ప్రతి కార్యక్రమానికి ముహుర్తాలు చూసుకుంటాం. అందుకు పురోహితులు, పండితుల చుట్టూ తిరుగుతాం. అలాంటి ముహుర్తాలకు శుక్రవారం నుంచి బ్రేక్ పడనుంది. ఈ నెల 30న ప్రారంభమయ్యే శుక్రమౌఢ్యమి (మూఢం) వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న మాఘ బహుళ అమావాస్య వరకు కొనసాగనుంది. అప్పటి వరకు శుభ కార్యాలకు విరామం ఏర్పడుతుంది. ఇప్పటికే వివాహాలు కుదుర్చుకుని సిద్దంగా ఉన్న వారు మంచి ముహుర్తాల కోసం మూఢమి ముగిసే వరకు వేచి ఉండాల్సిందే. జిల్లాలో కల్యాణ మండపాల్లో పెళ్లి బాజాలు, సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు 80 రోజుల పాటు వినిపించవు
మాఘమాసమూ మూఢంలోనే...
మాఘమాసం ఎప్పుడొస్తుందా అని వివాహాలు చేసుకునేవారు ఆశగా ఎదురు చూస్తారు. ఎందుకుంటే ఆ మాసంలో బలమైన ముహుర్తాలు ఉంటాయి. అయితే ఈసారి మాఘమాసం మూఢంలో కలవడంతో ఒక్క ముహుర్తం కూడా లేదు. అంతే కాదు..గృహ ప్రవేశాలకు అనుకూలమైన రథసప్తమి, వసంతపంచమి,మాఘ పౌర్ణమి వంటి ముఖ్యమైన తిథులు కూడా మూఢంలో కలిసిపోయాయి.
వ్యాపారులకు గడ్డుకాలం
శుభకార్యాలకు బ్రేక్పడనున్న ఈ 80 రోజులు వ్యాపారులకు గడ్డుకాలమనే చెప్పాలి. మదనపల్లెలో నీరుగట్టువారిపల్లెలో పట్టుచీరల వ్యాపారులు అధికంగా ఉన్నారు. పెళ్లిళ్ల సీజన్లో పట్టుచీరలకు మంచి డిమాండ్ ఉంటుంది. మౌడ్యమి చీరల వ్యాపారం పెద్దగా ఉండకపోవచ్చు. మండపాలు, ఫంక్షన్ హాల్స్, వస్త్రదుకాణాలు, స్వర్ణకారులు, నగల షాపుల యజమానులు, డెకరేషన్ , క్యాటరింగ్, ఫోటో, వీడియో గ్రాఫర్లు, టెంట్ హౌస్, పూల వ్యాపారులు, ట్రావెల్స్, లైటింగ్, డీజె బాక్సుల అద్దెకిచ్చేవారు ఇలా శుభకార్యాలపై ఆధారపడ్డ అన్ని రంగాల వారు ముఖ్యంగా పురోహితులు తీవ్రంగా నష్టపోనున్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 వరకు ముహుర్తాలు లేవు
శుక్రమౌఢ్యమే కారణం
ఒక గ్రహం సూర్య కిరణాల్లో కనుమరుగవడాన్ని జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మూఢం అంటారు. గ్రహశక్తులు బలహీనమవడంతో శుక్రగ్రహం సూచించే ఫలితాలు అనుకూలంగా ఉండవు. శుభకార్యాలకు గురుడు ఎంత ప్రధాన కారకుడో,శుక్రుడు కూఆ అంతే ప్రభావం కలవాడు. శుక్రుడు బలహీనమైతే సంబఽంధాలు వివాహ జీవితం, ఆర్థిక స్థిరత్వం వంటి విషయాల్లో ప్రతికూలతలు ఏర్పడుతాయమని పండితులు చెబుతున్నారు. శుక్రమౌడ్యం ఉన్న కాలంలో శుభకార్యాలు జరుపుకోవడం శుభసూచికం కాదని అంటున్నారు.


