వెస్ట్ బెంగాల్ యువకుడి హత్యకేసులో... మోస్ట్ వాంటెడ్
● నిందితుడిపై పలు స్టేషన్లలో
18కి పైగా కేసులు
● వివరాలు వెల్లడించిన
సీఐ మహమ్మద్ రఫీ
మదనపల్లె రూరల్ : పట్టణంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా పేరుపొంది, మర్డర్, గంజాయి, ఎర్రచందనం, సారా కేసుల్లో ప్రధాన నిందితుడైన సయ్యద్ సుల్తాన్(31) పోలీసులకు చిక్కాడు. ఆగస్ట్ 15న మదనపల్లె మండలం సీటీఎం రైల్వేస్టేషన్ సమీపంలో వెస్ట్బెంగాల్కు చెందిన ఎస్.కే.ఖదీర్ హత్యకేసులో నిందితుడుగా ఉంటూ పరారీలో ఉన్న సుల్తాన్, మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం స్థానిక వన్టౌన్ పోలీస్స్టేషన్లో సీఐ మహమ్మద్ రఫీ వివరాలు వెల్లడించారు. వెస్ట్బెంగాల్కు చెందిన ఎస్.కే.ఖదీర్ ఉపాధి నిమిత్తం మదనపల్లెకు వచ్చి కురబలకోట మండలం వద్ద మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతడికి గంజాయి తాగే అలవాటు ఉండటంతో తన అవసరాల కోసం ఒరిస్సా నుంచి తెచ్చుకునేవాడు. తను వాడుకుని మిగిలినది ఇతరులకు అమ్మేవాడు. ఈ క్రమంలో పట్టణంలోని బసినికొండకు చెందిన పఠాన్ ఆసిఫ్ఖాన్(40), దేవళంవీధికి చెందిన షేక్మౌలా(33), త్యాగరాజువీధికి చెందిన సయ్యద్ సుల్తాన్(31), మాలిక్ ఫంక్షన్ హాల్ ప్రాంతానికి చెందిన టీ.ఏ.మహమ్మద్ రబ్బానీ(21), అప్పారావుతోట సైదాపేటకు చెందిన షేక్ సాదిక్(22)తో పరిచయం ఏర్పడింది. వీరి మధ్య గంజాయి వినియోగం, కిలో రూ.24వేల రూపాయలతో విక్రయ లావాదేవీలు జరిగేవి. వెస్ట్ బెంగాల్ నుంచి వారంలోగా గంజాయి తెచ్చి ఇస్తానని ఏ–1 నిందితుడు పఠాన్ ఆసిఫ్ఖాన్ నుంచి ఎస్.కే.ఖదిర్ రూ.50వేలు నగదు తీసుకున్నాడు. వారంలో గంజాయి తెచ్చి ఇస్తానని చెప్పి నెలరోజులైనా ఇవ్వకపోవడంతో ఆసిఫ్ఖాన్ విషయాన్ని తన స్నేహితులకు తెలిపాడు. వారి సహకారంతో ఏపీ–09 సీఆర్–0267 టయాటో ఇథియోస్ కారును అద్దెకు తీసుకుని ఆగస్ట్ 15 ఉదయం అంగళ్లుకు వెళ్లి ఎస్.కే.ఖదీర్ను కిడ్నాప్ చేశారు. కారులో కర్నాటకలోని రాయల్పాడు అటవీప్రాంతానికి తీసుకెళ్లి గంజాయి ఇవ్వనందుకు ఎస్.కే.ఖదీర్ను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. సాయంత్రం అదే కారులో మదనపల్లెకు తీసుకువచ్చి దేవళంవీధిలోని ఆసిఫ్ఖాన్ ఇంట్లో ఉంచారు. రాత్రి తిరిగి ఎస్.కే.ఖదీర్ను కొట్టడంతో దెబ్బలు తాళలేక మరణించాడు. హత్యనేరం తమమీద పడుతుందన్న భయంతో సుల్తాన్ సూచన మేరకు... పఠాన్ ఆసిఫ్ఖాన్, షేక్ మౌలా ఆటోలో మరణించిన ఎస్.కే.ఖదీర్ను తీసుకువెళ్లి రైలు పట్టాల మీద పడేసి, ఆత్మహత్యగా చిత్రించాలని అనుకున్నారు. సీటీఎం రైల్వేస్టేషన్ వద్దకు తీసుకెళ్లి ట్రాక్ మీద పడేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈలోపు అటువేపుగా ఓ వాహనం రావడంతో వెలుతురులో తమను గుర్తిస్తారని మృతదేహాన్ని పట్టాల పక్కనే వదలి పారిపోయారు. రైలు నుంచి పడి మృతి చెంది ఉంటాడని భావించిన కదిరి రైల్వేపోలీసులు ఆగస్ట్ 16న అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో హత్యచేసినట్లు తేలడంతో ఆగస్ట్ 20న హత్యకేసుగా మార్పుచేశారు. హత్యకేసులో ప్రధాన నిందితులైన పఠాన్ ఆసిఫ్ఖాన్, షేక్ మౌలాలు ఆటోతో సహా కదిరి రైల్వే పోలీసులకు లొంగిపోయారు. కదిరి సబ్ జైలులో ఖైదీలుగా ఉన్నారు. అనంతరం ఈ కేసును మదనపల్లె వన్టౌన్ పోలీస్స్టేషన్కు బదిలీచేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హత్యకేసు విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. దర్యాప్తు ముమ్మరం కావడంతో ప్రధాన నిందితుడైన సయ్యద్ సుల్తాన్, మరో ఇద్దరు నిందితులు మహమ్మద్ రబ్బానీ, షేక్ సాదిక్లు.. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలసుబ్రహ్మణ్యం సమక్షంలో లొంగిపోయారన్నారు. దీంతో వన్టౌన్ పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. నిందితుల్లో ఏ–3గా ఉన్న సయ్యద్ సుల్తాన్పై మదనపల్లె, పీలేరు, వాల్మీకిపురం, తిరుపతి, విజయవాడ, కదిరి పోలీస్స్టేషన్లలో హత్య, గంజాయి, సారా, ఎర్రచందనం తదితరాలకు సంబంధించి 18 కేసులు నమోదై ఉన్నాయన్నారు. నిందితులు హత్యకు ఉపయోగించిన ఇథియోస్ కారును స్వాధీనం చేసుకున్నామన్నారు.
వెస్ట్ బెంగాల్ యువకుడి హత్యకేసులో... మోస్ట్ వాంటెడ్


