
మోసాలు చేస్తున్న ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పండి
వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు
ఒంటిమిట్ట : 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి మోసాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పే అవకాశం వచ్చిందని, ఈ నెల 12న జరగబోయే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, మీ సత్తా కూటమి ప్రభుత్వానికి చూపించాలని మండల ప్రజలతో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే సుధా, కడప మేయర్ సురేష్ బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్బాషా, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని చింతరాజుపల్లి, కోనరాజుపల్లి పంచాయతీల్లోని గ్రామాల్లో అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఉప ఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాని ప్రజలను కోరారు. అనంతరం మేడా రఘునాథ్రెడ్డి మాట్లాడుతూ..తప్పుడు హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ప్రభుత్వానికి ఈ ఎన్నికతో బుద్ధిచెప్పాలన్నారు.
● ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ..సూపర్ సిక్స్ అంటు అధికారంలోకి వచ్చిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అహంకారాన్ని అణిచేవిధంగా ఎన్నిక ఫలితాలు తీసుకురావాలని అన్నారు.
● ఎమ్మెల్యే సుధా మాట్లాడుతూ..రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ఇస్తానన్న ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయలేమన్న టీడీపీ నేతలకు ఈ ఉప ఎన్నికల పలితాలు చెంప పెట్టుకావాలన్నారు.
● కడప మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ..ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా ఉన్న వారికి నిరుద్యోగ భృతిని ఇస్తానని మోసం చేసిన ప్రభుత్వానికి ఈ ఉప ఎన్నిక ఫలితాలతో సిగ్గు రావాలన్నారు.
● మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ..రైతులకు ప్రతి ఏటా కేంద్రం ఇస్తున్న రూ. 2 వేలతో కలిపి రూ. 20వేలు ఇస్తానని రైతన్నను నిలువులా ముంచేసిన ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధంతో ఓడించాలన్నారు.
● వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..ఫించన్లు పెంచినట్లే పెంచి వెనుకల గోతులు తీసినట్లు సుమారు 1లక్ష 50 వేల మంది పింఛన్దారులను అనర్హులగా చేసిన సీఎం చంద్రబాబుపై ఈ ఉప ఎన్నిక సహాయంతో మీ తిరుగుబాటును చూపించాలన్నారు. – మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ..ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూనే ఒక పక్క రెడ్ బుక్ పరిపాలన సాగిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఈ రెడ్ బుక్ పరిపాలనలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపే వారందరిపై అక్రమ కేసులు, హత్యా రాజకీయం, మహిళలపై అత్యచారాలు, దాడులు చేస్తూ శాంతి భద్రతలు అనేటివి మంటగలుస్తున్నాయి. అలాంటి అధికార పార్టీ ని ఓడించి శాంతిభద్రతలను కాపాడాలని కోరారు.
● ఎమ్మెల్సీ రామచంద్రరెడ్డి మాట్లాడుతూ..రాజంపేట నియోజకవర్గంలో అధికార పార్టీ రాజు లేని రాజ్యంగా తయారైందన్నారు. ఒంటిమిట్ట మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి మండల నాయకులు, కార్యకర్తల మధ్య సఖ్యత లేక వర్గ పోరుతో వారి ఉనికిని కాపాడుకునేందుకు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. అలాంటి వారిని మనం గెలిపించినా ఉపయోగం ఉండదన్నారు.
● రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ..ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని గెలిపిస్తే మండలంలోని ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని, మండల అభివృద్ధి ముందుకు పోతుందని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి, ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్రెడ్డి, నందలూరు ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి, రాజంపేట నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షుడు కూండ్ల ఓబుల్ రెడ్డి, రాజంపేట బీసీ సెల్ అధ్యక్షుడు రాజమోహన్నాయుడు, కోనరాజుపల్లి సర్పంచ్ శేఖర్రెడ్డి, ఒంటిమిట్ట మండల పంచాయతీ రాజ్ అధ్యక్షుడు మేరువ శివనారాయణ, వైఎస్సార్సీపీ మండల ప్రచార విభాగం అధ్యక్షుడు రాజశేఖర్రాయల్, జంగాల శివశంకర్ పాల్గొన్నారు.