
ప్రతిభకు పరీక్ష
మదనపల్లె సిటీ : విద్యార్థులు పరిశోధన, ప్రయోగాల్లో రాణించేలా ఏటా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంధన్ (వీవీఎం) పేరుతో జాతీయ స్థాయిలో ప్రతిభాన్వేషణ్ పరీక్ష నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సమాచార సంస్థ ఆద్వర్యంలో ఎన్సీఈఆర్టీ, విజ్ఞాన్ ప్రసాద్,విజ్ఞానభారతి సంయుక్తంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నా, ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు భారతదేశ ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఇంటర్న్షిప్, స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంటుంది.
ఈ పరీక్షకు 2025–26 విద్యా సంవత్సరానికి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకోండిలా...
విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పరీక్ష రాసేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు రూ.200 చెల్లించి వీవీఎం అనే వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి. పరీక్ష జరిగే రోజు విద్యార్థులు వారికి అందుబాటులో ఉన్న మొబైల్, ల్యాప్టాప్, డెస్క్టాప్, డిజిటల్ పరికరాలలో ఏదైనా ఒక దాని ద్వారా నిర్దేశించిన అప్లికేషన్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంటి నుంచే పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. పుస్తకాలు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
పోటీ పరీక్షను జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహిస్తారు. 6 నుంచి 8 తరగతులకు జూనియర్, 9 నుంచి 11 తరగతులకు సీనియర్ గ్రూపుగా విభజిస్తారు. ఇందులో తెలుగు, హిందీ, ఆంగ్లం తదితర ప్రాంతీయ భాషల్లో పరీక్ష ఉంటుంది. విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి నచ్చిన భాషలో పరీక్ష రాయవచ్చు. పాఠశాల స్థాయి ప్రాథమిక పరీక్ష రాసిన విద్యార్థుల్లో తరగతుల వారీగా ప్రతిభ మొదటి 20 మందిని ఎంపిక చేస్తారు. 6 నుంచి 11 తరగతులకు మొత్తం 120 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. ఇందులో ప్రతిభ చూపిన ప్రతి తరగతి నుంచి ముగ్గురు వంతున మొత్తం 18 మందిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు.
వంద మార్కులకు పరీక్ష
నమూనా పరీక్ష అక్టోబర్ 28 నుంచి 30 తేదీల వరకు నిర్వహిస్తారు. ప్రధాన పరీక్ష నవంబర్ 19న అబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. జూనియర్, సీనియర్ రెండు విభాగాల్లో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 100 మార్కులుంటాయి. సెక్షన్–ఎలో విజ్ఞానశాస్త రంగంలో భారతీయ మేధావుల కృషి 20, శాంతి స్వరూప్ భట్నాగర్ జీవిత చరిత్ర నుంచి 20 ప్రశ్నలు, సెక్షన్–బిలో జూనియర్ ,సీనియర్ విద్యార్థులకు గణితం, ఫిజిక్స్,కెమిస్రీ, బయాలజీ సబ్జెక్టుల నుంచి 50, లాజికల్ థింకిం గ్,, రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలుంటాయి.
నగదు ప్రోత్సాహకాలు:
జాతీయస్థాయిలో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతిగా వరుసగా రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలతో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు. జాతీయ, జోనల్ స్థాయి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు డీఆర్డీఓ, ఇస్త్రో, సీఎస్ఐఆర్, బీఏఆర్సీ వంటి ప్రఖ్యా త జాతీయ ప్రయోగశాలలు, పరిశోధన సంస్థల్లో ఒకటి నుంచి మూడు వారాల పాటు ప్రత్యేక శిక్షణ, ఇంటర్న్షిప్కు ఎంపిక చేస్తారు.
6 నుంచి ఇంటర్ ఫస్టియర్
విద్యార్థులకు అవకాశం
విద్యార్థి విజ్ఞాన్ మంథన్కు
దరఖాస్తుల ఆహ్వానం
ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు
తుది గడువు సెప్టెంబర్ 30