గుర్రంకొండ : అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 20 కిలోల గంజాయిని, ఎనిమిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. వాల్మీకిపురం సీఐ ప్రసాద్ , గుర్రంకొండ ఇన్చార్జి ఎస్ఐ చంద్రశేఖర్లు గత రాత్రి గుర్రంకొండలో నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది అనుమానిత వ్యక్తులు ప్లాస్టిక్ సంచుల్ని కలిగి ఉండడం గమనించి వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. దుర్గంధం వెదజల్లుతున్న నాలుగు కిలోల గంజాయిని ఒక సెల్ఫోన్ను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. దొరికిన నిందితుల్లో ఒకరు ఇచ్చిన సమాచారం మేరకు పీలేరు టౌన్లోని పీలేరు– కలకడ మార్గంలోని దినకర్ హోటల్ వెనుక మాటు వేసి గంజాయి విక్రయిస్తున్న వారిపై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 16 కిలోల గంజాయిని, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ముఠాలుగా ఏర్పడి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సుశాంత మహానంద వద్దనుంచి గంజాయిని కొనుగోలు చేసి జిల్లాలో విక్రయిస్తున్నట్లు తేలింది. దీంతో బుధవారం ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సుశాంత మహనంద(27), జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన షేక్ నౌషాద్ అహ్మద్(26) షేక్ ఇర్షాద్ అహ్మద్ (27, గుర్రంకొండకు చెందిన కలకడ ఆదిల్(21), టి.గణేష్(19) చిత్తురు జిల్లా ఐరాల మండలానికి ఎస్ సిద్దయ్య(55), చిన్నమండెం మండలానికి చెందిన షేక్ ఫహాద్ అలీ(21), రాయచోటికి చెందిన గుండ్లపెంట ఆసీఫ్(23), బగినేని ప్రతాప్(24), షేక్ మహమ్మద్ అలీ(30)లను అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేశారు. వారి వద్ద ఉన్న 20 కిలోల గంజాయి, ఎనిమిది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ కేసులో గుర్రంకొండకు చెందిన కమాల్ పరారీలో ఉన్నాడు. గంజాయి ముఠాసభ్యుల్ని రిమాండ్ నిమిత్తం వాల్మీకిపురం కోర్టుక తరలించారు. గంజాయి ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేయడంలో మంచి ప్రతిభ కనబరిచిన పోలీసులకు రివార్డులు అందజేశారు. మరికొంతమంది పోలీస్ ఉన్నతాధికారులకు రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకిపురం సీఐ ప్రసాద్, గుర్రంకొండ ఇన్చార్జి ఎస్ఐ చంద్రశేఖర్, ఏఎస్ఐలు గజేంద్ర, బొజ్జానాయక్, హెడ్కానిస్టేబుళ్లు నాగరాజ నాయక్, అబ్దుల్లా, రిజ్వాన్ పాల్గొన్నారు.