
స్టాపింగ్ కోసం నిరీక్షణ !
ఓబులవారిపల్లె : మండల కేంద్రంలో ఎక్స్ప్రెస్ రైళ్లు స్టాపింగ్ ఎత్తివేసి దాదాపు ఐదు నెలలు అయింది. రైల్వే అధికారులు కాని నాయకులు కాని స్టాపింగ్ పునరుద్ధరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి రైల్వే చరిత్ర కలిగిన ఓబులవారిపల్లె రైల్వే పరంగా జంక్షన్ కాక ముందు నుంచి దశాబ్దాలుగా పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు ఇక్కడ స్టాపింగ్ ఉండేది. ఇక్కడి నుండి చె విలువైన కలపను చైన్నెకి రవాణా చేస్తుండేవారు. అప్పట్లో ఎలకంటి సుబ్బయ్య శ్రేష్టి అనే సామాన్య వ్యక్తి రైల్వేశాఖ అధికారులతో పోరాడి పలు ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుపుదల చేయించారు. అప్పటి నుంని నిరంతరాయంగా రాయలసీమ, జయంతి జనతా ఎక్స్ప్రెస్ రైళ్లు ఇక్కడ ఆగేవి. కాలక్రమేణా వెంకటాద్రి, రాయలసీమ, హరిప్రియ ఎక్స్ప్రెస్లు ఆగేవి. టీడీపీ రైల్వేకోడూరు ఇన్చార్జి, రైల్వేకొడూరు ఎమ్మెల్యే, జనసేన పార్టీ, బీజేపీ జాతీయ స్థాయి నాయకులు మండల కేంద్రానికి చెందిన వారే. అయినా ఐదు నెలలుగా ఎక్స్ప్రెస్ రైళ్ల స్టాపింగ్ తొలగించినా వారు ఏమీ పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.
పట్టించుకోని రైల్వే శాఖ..
మండలం నుంచి చిట్వేలి, రాపూరు, వెంకటాచలం మీదుగా రైలుమార్గం ఏర్పాటు చేయడంతో ఓబులవారిపల్లె జంక్షన్ అయింది. రైల్వేపరంగా అభివృద్ధి చెందుతుందని నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూశారు. అభివృద్ధి మాట దేవుడెరుగు ఉన్న ఎక్స్ప్రెస్ రైళ్ల స్టాపింగ్ కూడా ఎత్తివేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ మార్గంలో నంద్యాల మీదుగా గుంటూరుకు, రేణిగుంట మీదుగా కన్యాకుమారి, చైన్నె, విశాఖపట్టణానికి రైళ్లు నిత్యం ప్రయాణిస్తున్నాయి. అయితే చాలా ఎక్స్ప్రెస్ రైళ్లు రేణిగుంట, కడపలో గంటల తరబడి నిలబడుతున్నాయి. అలాంటి ఎక్స్ప్రెస్లకు రెండు నిమిషాల పాటు ఓబులవారిపల్లెలో హాల్టింగ్ కల్పిస్తే రైల్వే శాఖకు ఎలాంటి నష్టం ఉండదు. కడప నుండి హరిప్రియ ఎక్స్ప్రెస్ ఉదయం 4.45 నిమిషాలకు బయలుదేరి నందలూరుకు 5.10కి చేరుకుంటుంది. అక్కడ 20 నిమిషాల పాటు ఉంటుంది. రేణిగుంట నుండి తిరుమల ఎక్స్ప్రెస్ ఆపై గుంతకల్లుకు వెళ్లే రైలు రేణిగుంటలో 4.58కి బయలుదేరి కడపకు 7 గంటలకు చేరుకుంటుంది. అక్కడ 45 నిమిషాలు హాల్టింగ్ అనంతరం గుంతకల్లుకు బయలుదేరుతుంది. అదేవిధంగా గుంటూరు ఎక్స్ప్రెస్ రెండు రైళ్లు నంద్యాల రైల్వేస్టేషన్లో గంటకు పైగా ప్రతి రోజు నిలబడుతున్నాయి. ఇలా ఇంకా చాలా ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. వాటికి రెండు నిమిషాలు హాల్టింగ్ కల్పిస్తే రైల్వేశాఖకు నష్టం లేదకపోగా ఇంకా ఆదాయం పెరుగుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఓబులవారిపల్లె జంక్షన్గా మారి ఐదేళ్లయినా కనీసం బోర్డులో కూడా జంక్షన్ అని పేరు మార్చలేదంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది.
ప్రయాణికుల అగచాట్లు
మండలంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మంగంపేట బైరెటీస్ గనులు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఖనిజం విదేశాలకు ఎగుమతులు జరుగుతుంటాయి. ఏపీఎండీసీ మంగంపేట కార్యాలయంతో పాటు దాదాపు 150 పల్వరైజింగ్ మిల్లులు, చిన్న పరిశ్రమలు ఉన్నాయి. చాలామంది వ్యాపారులు రాకపోకలు సాగిస్తుంటారు. అంతే కాకుండా బొప్పాయి, అరటి, తమలపాకు, మామిడి తదితర పంటలను రైతులు సాగుబడి చేస్తుంటారు. వారు చైన్నె, ముంబై తదితర నగరాలకు నిత్యం వెళ్లాల్సి ఉంటుంది. నగరాలలో చదువుల కోనం, ఉద్యోగులు తమ విధుల కోసం రాకపోకలు సాగిస్తుంటారు. ఎక్స్ప్రెస్ రైళ్ల స్టాపింగ్ తొలగించడంతో వారంతా రైల్వేకోడూరు, రాజంపేటకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికై నా నియోజకవర్గంలోని వివిధ పార్టీల నాయకులు స్పందించి మండల కేంద్రంలో ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
ఓబులవారిపల్లె జంక్షన్పై
రైల్వేశాఖ శీతకన్ను
ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ ఎత్తేయడంతో అవస్థలు
జాతీయ స్థాయి నాయకులున్నా
ఫలితం శూన్యం
ఎంపీ చొరవతో గతంలో స్టాపింగ్
కోవిడ్ అనంతరం స్టాపింగ్లు ఎత్తి వేశారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి చొరవతో రైల్వే మంత్రిని కలిసి రెండు సార్లు ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ కల్పించారు. ఈ విషయంపై ఎంపీ ఇప్పుడు కూడా దిల్లీలో రైల్వే శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. బీజేపీ నాయకులు, రైల్వేశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
– తల్లెం భరత్ కుమార్రెడ్డి, డీఆర్యూసీసీ మెంబర్, ఓబులవారిపల్లె.
ఎక్స్ప్రెస్లకు స్టాపింగ్ కల్పించాలి
ఐదు నెలలుగా ఎక్స్ప్రెస్ రైళ్లు నిలబడటం లేదు. దీంతో చాలా ఇబ్బందిగా ఉంది. ఆసుపత్రులకు తిరుపతికి, హైదరాబాదుకు వెళ్లలన్నా రైళ్లు చాలా అనుకూలంగా ఉండేవి. దూర ప్రాంతాలకు బస్సుల్లో ప్రయాణాలు సాగించలేము. ఇప్పటికై నా నాయకులు స్పందించాలి.
– ఆర్. వెంకటేష్, రైతు, వై.కోట, ఓబులవారిపల్లె.

స్టాపింగ్ కోసం నిరీక్షణ !

స్టాపింగ్ కోసం నిరీక్షణ !

స్టాపింగ్ కోసం నిరీక్షణ !