
సిమెంట్ రోడ్డు ధ్వంసం చేసిన ఘటనలో టీడీపీ నాయకులపై కేసు
చాపాడు : మండల పరిధిలోని తిప్పిరెడ్డిపల్లె దళితవాడకు వెళ్లే సిమెంట్ రోడ్డు ధ్వంసం ఘటనపై పడమర అనంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులైన నందిమండలం మల్లికార్జునరెడ్డి, ఆయన సోదరుడు బాల సుబ్బారెడ్డి పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. తిప్పిరెడ్డిపల్లె దళితవాడకు వెళ్లేదారిలో ఐదేళ్ల క్రితం ప్రభుత్వ నిధులతో సిమెంట్ రోడ్డు నిర్మించారని, ఈ స్థలం తమదని శనివారం మల్లికార్జునరెడ్డి, ఆయన సోదరుడు రోడ్డును తొలగించడంపై అక్కడి దళితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైంది
– ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి
కడప ఎడ్యుకేషన్ : వృత్తులో కెల్లా నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కడప సాయికృప నర్సింగ్ కళాశాలలో జ్యోతి ప్రజ్వలన, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ కరోనా సమయంలో డాక్టర్లు, నర్సులు చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. సాయిబాబా విద్యాసంస్థల సీఈఓ ఎంవీ శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యం పెట్టుకుని చదవాలని కోరారు. ప్రజలకు సేవచేయడానికి నర్సింగ్ వృత్తి దోహదపడుతుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ విద్యావతి మాట్లాడుతూ సాయికృప నర్సింగ్ కళాశాలలో అనేక రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్ నర్సింగ్ సూపరింటెండెంట్లు రమణమ్మ, కాంతమ్మతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.
చింతచెట్లు అక్రమంగా నరికివేత
గుర్రంకొండ : మండలంలోని టి.రాచపల్లె పంచాయతీలో చింతచెట్లను అక్రమంగా నరికి వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా గ్రామంలోని టి.రాచపల్లె కస్పా, ఎగువ బురుజుపల్లె, దిగువ బురుజుపల్లె గ్రామాల్లో 25 చింతచెట్లను అక్రమంగా నరికివేశారు. తమిళనాడుకు చెందిన కొంతమంది వ్యాపారులు ప్రభుత్వ భూముల్లోనూ, దేవుడి మాన్యం భూములు, వంక పోరంబోకు భూముల్లో అక్రమంగా చింతచెట్లను నరికి వేసి వారి రాష్ట్రాలకు లారీల్లో తరలించుకుపోతున్నారు. రెవెన్యూ, అటవీశాఖకు చెందిన అధికారుల అనుమతి లేకుండా ఇష్టానుసారం చెట్లను నరికివేసి తరలించేస్తున్నారు. చింతచెట్ల నరికివేతపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై ఆర్ఐ సదాశివను వివరణ కోరగా గ్రామస్తులు ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమన్నారు. వీఆర్ఓను పంపించి ఉన్న కట్టెలను తరలించకుండా సీజ్ చేశామన్నారు. అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తామన్నారు.
కొండయ్యగారిపల్లెలో చోరీ
నిమ్మనపల్లె : మండలంలోని కొండయ్యగారిపల్లెలో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 50 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఘటనపై బాధితుడు పురుషోత్తం రెడ్డి ఆదివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పురుషోత్తం రెడ్డి కుటుంబంతో పాటు వ్యక్తిగత పనులపై బయట ప్రాంతానికి వెళ్లాడు. శనివారం రాత్రి ఇంటికి తిరిగి రాగా తలుపులు పగలగొట్టి ఉండడంతో, లోపలికి వెళ్లి పరిశీలించారు. బీరువాను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి అందులోని 49 గ్రాముల బరువు గల బంగారు చైన్ అపహరించుకుని వెళ్లినట్లు గుర్తించారు. చైన్ విలువ సుమారు రూ.1.5 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ ఆదివారం బాధితుని ఇంటికి వెళ్లి చోరీకి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటిని పరిశీలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్ఐ తిప్పేస్వామి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మహిళ మెడలో
గొలుసు లాక్కెళ్లారు
ఒంటిమిట్ట : మండలంలో మంటపంపల్లి గ్రామంలోని కడప–చైన్నె జాతీయ రహదారిౖపై ఈనెల 18న శుక్రవారం సాయంత్రం మహిళ మెడలోని గొలుసును గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు. ఆదివారం బాధితురాలి ఫిర్యాదు మేరకు ఒంటిమిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. మహాత్మాగాంధీ జ్యోతీబాయి పూలే గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మంటపంపల్లెకు చెందిన చింతల రాజ్యలక్ష్మీ(42) మంటపంపల్లె జాతీయ రహదారిౖ పక్కనే ఉన్న సెల్ టవర్ వద్దకు రాగానే గుర్తు తెలియని దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆమె మెడలోని 30.5 గ్రాముల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘటనలో గాయపడిన ఆమె నందలూరు ప్రభుత్వ అసుపత్రిలో చికిత్స పొంది, ఆదివారం ఒంటిమిట్ట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

సిమెంట్ రోడ్డు ధ్వంసం చేసిన ఘటనలో టీడీపీ నాయకులపై కేసు

సిమెంట్ రోడ్డు ధ్వంసం చేసిన ఘటనలో టీడీపీ నాయకులపై కేసు