
ఏపీఈసెట్ ఫలితాలు విడుదల
కడప ఎడ్యుకేషన్ : అనంతపురం జవహరలాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ గురువారం విడుదల చేసిన ఏపీఈసెట్ ఫలితాల్లో వైఎస్సార్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటి ర్యాంకుల పంట పండించారు. డిప్లమా హాల్టర్స్, బీఎస్సీ(మ్యాథమాటిక్స్) డిగ్రీ హాల్డర్స్ ఏపీ ఈసెట్లో అర్హత సాధించి లాటరల్ ఎంట్రీ ద్వారా ద్వితీయ సంవత్సరం ఇంజినీరింగ్ లేదా ఫార్మసీలో ప్రవేశం పొందవచ్చు. ఈ నెల 6న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలు గురువారం వెలువడ్డాయి. రాజుపాలెం మండలం కుటూరు గ్రామానికి చెందిన మెట్టా దివాకర్ రెండో ర్యాంకు, తొండూరు మండలం గుండ్లమడుగుకు చెందిన పల్టెటి రాజశ్రీ ఐదో ర్యాంకు, ఖాజీపేట మండలం సుంకేసులకు చెందిన తరుణ్ ఆరో ర్యాంకు, వేంపల్లి మండలం ముత్తకూరుకు చెందిన వద్దరపు గణేష్ ఆరో ర్యాంకు, జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన గువ్వల జయచంద్రారెడ్డి పదో ర్యాంకు సాధించి భళా అనిపించారు.
సత్తా చాటిన మిషన్ డ్రైవర్ కొడుకు
తల్లితండ్రుల కష్టాలను తీర్చాలని కష్టపడి చదివి ర్యాంకు సాధించాడు బాలమహేష్. వేముల మండలం మబ్బుచింతపల్లె గ్రామానికి చెందిన గుజ్జల మారుతి యురేనియం ప్యాక్టరీలో ఓ మిషన్ డ్రైవర్గా పనిచేస్తుండగా తల్లి గంగాదేవి గృహిణి.
తల్లితండ్రుల కష్టాన్ని కళ్లారా చూసిన వారి కుమారుడు దేవి కుమారుడు గుజ్జల బాల మహేష్ కష్టపడి చదివి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు పులివెందులలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిన మహేష్ డిప్లమో మైనింగ్ కోర్సు పులివెందుల లయోలా కళాశాలలో పూర్తి చేశారు. తాజాగా ఏపీ ఈసెట్లో 111 మార్కులతో రాష్ట్ర స్థాయిలో పస్ట్ ర్యాంకు సాధించారు. పలువురు అతడిని అభినందించారు.
కూలీ కొడుకుకు ద్వితీయ ర్యాంకు
కూలి పనులు చేసుకుంటున్న చిన్నపుల్లయ్య కుమారుడు ఏపీ ఈసెట్లో రాష్ట్ర స్థాయి ద్వితీయ ర్యాంకు సాధించాడు. రాజుపాలెం మండలం కూలూరు గ్రామానికి చెందిన మెట్టు చిన్నపుల్లయ్య, ఏసమ్మల కుమారుడు మొట్టు దివాకర్ ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఓ ప్రైవేటు పాఠశాలలో చదివాడు. ఆ తరువాత డిప్లమా ఈఈఈని తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పూర్తి చేశాడు. ఏపీ ఈసెట్ ఈఈఈ విభాగంలో రాష్ట్ర స్థాయి ద్వితీయ ర్యాంకు సాధించాడు. కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేసి తల్లిదండ్రుల కష్టాలు తీరుస్తానని మొట్టు దివాకర్ తెలిపారు.
జిల్లాలో పలువురికీ ర్యాంకుల పంట

ఏపీఈసెట్ ఫలితాలు విడుదల