
లాభం మరొకరికి
కష్టం ఒకరిది..
టాస్క్ ఫోర్స్: నల్ల గంగమ్మ సాక్షిగా కూటమి ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడింది. ఆలయాల అభివృద్ధికి సహకరించాల్సిన నేతలే వాటి పేరు చెప్పి దోచుకోవడంపై ప్రజలు మండి పడుతున్నారు. నల్లగంగమ్మ ఆలయాన్ని అడ్డుపెట్టుకొని ముందుగా వేసిన రోడ్డుపై సిమెంట్ రోడ్డును మాత్రమే వేసి మొత్తం పనులు తామే చేసినట్లు రూ.కోటి 40 లక్షల రూపాయలు బిల్లును దోచుకున్న ఉదంతం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పీఏ రెడ్డి కుమార్ ఈ దోపిడీకి పాల్పడినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. రూ. కోటి 75 లక్షలకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు మొదటి విడతగా రూ.కోటి 40 లక్షలు బిల్లులు చేశారు. కొండేటి శ్రీనివాసులునాయుడు పేరున గత ఏడాది (2024) ఆగస్టు 20వ తేదీన కోటి 39 లక్షల, 62వేల 206 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో జమ అయింది. ఈ బిల్లు మొత్తం (ఆగస్టు 21న) మరుసటి రోజే మంత్రి పీఏ ఎ.రెడ్డికుమార్కు ముట్టినట్లు సమాచారం. మిగిలిన రూ.35 లక్షలకు బిల్లులు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి పీఏ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. అయితే అధికారులు మాత్రం ఇప్పటికే చేయని పనులకు కూడా బిల్లులు చేసి తప్పు చేశామని, మిగిలిన వాటికి బిల్లులు పెడితే మా ఉద్యోగాలు ఊడతాయని వాపోయినట్లు సమాచారం.పీఏ మాత్రం బిల్లులు చేయాల్సిందే అంటూ హుకుం జారీ చేసినట్లు వినికిడి.
రూ. 50 లక్షలతో మట్టి రోడ్డు..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ. 50 లక్షలు ఖర్చుచేసి 950 మీటర్ల మేర మట్టి రోడ్డును పూర్తి చేశారు. అప్పట్లో ఈ రోడ్డుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి బిల్లు చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ అనుమతులు తెప్పించి మట్టి రోడ్డుపై సిమెంట్ రోడ్డును పూర్తి చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనుమతితో స్థానికులు రూ.75 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ మేరకు అప్పటి ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి భూమి పూజ చేసి మట్టి రోడ్డు పనులను ప్రారంభించారు. స్థానికుల సాయంతో స్థానిక నాయకుడు ఒకరు రూ.50 ల క్షలు ఖర్చు చేసి మట్టి రోడ్డు, విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు. అప్పటి ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో అధికారులు బిల్లులు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు కూడా మంత్రి పీఏ ఖాతాలో జమ చేసుకున్నట్లు సమాచారం.
● సంబేపల్లె మండల ప్రజలే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా భక్తులు అందించిన విరాళాలతో గంగమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేశారు.ఈ గుడికి కిలోమీటర్ దూరంలో ఉన్న చిత్తూరు– కడప జాతీయ రహదారి నుంచి సిమెంట్ రోడ్డు వేయడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.75 లక్షలతో ప్రతిపాదనలు రూపొందించింది. అప్పటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రోడ్డు పనుల ప్రారంభానికి భూమి పూజ చేశారు. అధికారుల అనుమతితో రూ.50 లక్షల ఖర్చు చేసి మట్టి రోడ్డును ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రభుత్వంలో చేసిన పనికి ఒక్క రూపాయి ప్రభుత్వ బిల్లుకు నోచుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో చేసిన పనులను కలుపుకుని బిల్లులు చేసుకోవడంపై స్థానికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
నల్ల గంగమ్మ రోడ్డు పేరుతో రూ. 1.40 కోట్లు దోపిడీ
రోడ్డు వేసింది వైఎస్సార్సీపీ నాయకులు..బిల్లు చేసుకుంది మంత్రి పీఏ
మరో రూ.35 లక్షల బిల్లులు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి