కురుబ ఎస్టీ సాధనపై 4న రౌండ్టేబుల్ సమావేశం
మదనపల్లె : రాష్ట్రంలోని కురుబ, కురుమ, కురువ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్తో ఏప్రిల్ 4న ఢిల్లీలోని ఆంధ్రాభవన్లో కుల ప్రతినిధులు, యువత, మేధావులతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సంఘ రాష్ట్ర అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు తెలిపారు. గురువారం కురవంకలోని కురుబ సంఘ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమిళనాడు, కర్ణాటక, గోవా, కేరళలోని కురుబ, కురుమలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అక్కడి సంఘాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రప్రభుత్వానికి నివేదికలు పంపాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి కురుబ, కురుమలను గుర్తించి రాజకీయంగా రాజ్యసభకు ఒకరిని, ఎంపీగా ఒకరిని, మంత్రులుగా ఒకరికి, ఎమ్మెల్యేలుగా ఇద్దరికి, బీసీ కమీషన్ మెంబర్, ముగ్గురికి కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం కల్పించారన్నారు. కురుబ, కురుమల ప్రధాన జీవనాధారం గొర్రెల పెంపకమని, వాటి పోషణ, జీవనోపాధి నిమిత్తం అడవుల్లో సంచరించే తమను షెడ్యూల్ ట్రైబ్స్కు చెందిన వ్యక్తులుగా గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చాలని ఢిల్లీలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో కురుబ సంఘ ప్రతినిధులు కప్పలరాజన్న, గుడిరామాంజులు, రాజ్కుమార్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.