
కమీషన్ల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మీ వాళ్లకు పందేరం చేస్తారా?
సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరుంది
2019కి ముందే మూడు దఫాలు సీఎంగా ఉన్న మీరు ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా పెట్టారా?
కనీసం ఆ ఆలోచనైనా చేశారా?.. మా ఐదేళ్ల కాలంలోనే మేము పెట్టిన 17 కాలేజీల్లో 5 చోట్ల క్లాసులు ప్రారంభం
ఎన్నికలు ముగిశాక మరో చోట అడ్మిషన్లు
మిగిలిన పనులు మీరు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లకుండా రాష్ట్రానికి ద్రోహం చేశారు
అలా తీసుకెళ్లుంటే గతేడాది మరో 5, ఈ ఏడాది మరో 7 కాలేజీల్లో క్లాసులు ప్రారంభమయ్యేవి కాదా
వైద్యవిద్యతోపాటు ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందేది
మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్కాంల కోసం ప్రైవేటుపరం చేస్తారా?.. ఇది అవినీతిలో మీ బరితెగింపునకు నిదర్శనం.. చరిత్ర హీనుడిగా నిలిచిపోతారు
ఇన్ని పాపాలు చేస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరు
మేం అధికారంలోకి రాగానే ఈ నిర్ణయాలను రద్దు చేస్తాం
ఈ కాలేజీలను మళ్లీ ప్రభుత్వ రంగంలోకే తెచ్చుకుంటాం
ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి మీరు తప్పుకుని ప్రైవేటుకు ఇవ్వడం ఘన కార్యంగా ప్రచారం చేయించుకోవడం సిగ్గుగా లేదా? మా ప్రభుత్వ హయాంలోనే ఏటా రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఈ పథకాన్ని వర్తింపచేశాం. తద్వారా రాష్ట్రంలో 95% కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. ఇక మీరు కొత్తగా చేసేది ఏముంది? అసలు మీ ఇన్సూరెన్స్ పథకం పరిధి రూ.2.5 లక్షలకేనా? లేక రూ.25 లక్షలకా? ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి రూ.3,600 కోట్లు ఖర్చు చేయలేని మీరు రూ.5 వేల కోట్లు ప్రీమియంగా ఖర్చు చేస్తారా? ఇది నమ్మదగ్గ విషయమేనా? – వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ‘మా ప్రభుత్వ హయాంలో మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కమీషన్ల కక్కుర్తితో మీ వాళ్లకు పందేరం చేస్తారా? ఈ రాష్ట్రం మీ జాగీరు అనుకుంటున్నారా?’ అని సీఎం నారా చంద్రబాబునాయుడుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 కంటే ముందు మూడు దఫాలుగా సీఎం ఉన్న మీరు ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా పెట్టారా.. అని నిలదీశారు. కనీసం ఆ ఆలోచనైనా చేశారా అంటూ నిప్పులు చెరిగారు.
తమ ప్రభుత్వ ఐదేళ్ల అతి కొద్ది కాలంలోనే తాము ప్రభుత్వ రంగంలో పెట్టిన 17 కాలేజీల్లో ఐదు చోట్ల క్లాసులు ప్రారంభమయ్యాయని, ఎన్నికలు ముగిశాక మరో చోట అడ్మిషన్లు జరిగాయని గుర్తు చేశారు. మిగిలిన పనులు మీరు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి ఉంటే గతేడాది మరో ఐదు.. ఈ ఏడాది మరో 7 కాలేజీల్లో క్లాసులు ప్రారంభమయ్యేవి కాదా? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. వాటిని ముందుకు తీసుకెళ్లకుండా ఈ రాష్ట్రానికి ఎందుకు ద్రోహం చేస్తున్నారంటూ సూటిగా ప్రశ్నించారు.
తాము పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్కాంల కోసం నిన్న (గురువారం) కేబినెట్లో ప్రైవేటుపరం చేస్తారా..? ఇది అవినీతిలో మీ బరితెగింపునకు నిదర్శనం కాదా? అంటూ దెప్పి పొడిచారు. దీంతో మీరు చరిత్రహీనుడిగా నిలిచిపోతారని స్పష్టం చేశారు. ఇన్ని పాపాలు చేస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరని హెచ్చరించారు. తాము అధికారంలోకి రాగానే ఈ నిర్ణయాలను రద్దు చేస్తామని, ఈ కాలేజీలను మళ్లీ ప్రభుత్వ రంగంలోకే తెచ్చుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..
» చంద్రబాబు గారూ.. అనుకున్నంత పని చేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీ వాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్కాంల కోసం కేబినెట్లో ప్రైవేటుపరం చేస్తూ నిర్ణయం తీసుకోవడం అవినీతిలో మీ బరితెగింపునకు నిదర్శనం. రాష్ట్రానికి శాశ్వతంగా చేస్తున్న అన్యాయం. ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరు ఉంది. దీంతో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతారు చంద్రబాబు గారూ. ప్రజల కోసం కాకుండా దోపిడీ కోసం నిర్ణయాలు తీసుకోవడానికే మీరు మంత్రివర్గ సమావేశాలు పెట్టుకుంటున్నట్టుగా ఉంది.
» 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 11. పద్మావతి అటానమస్ కాలేజీతో కలుపుకుంటే మొత్తం 12. 2019కి ముందు మూడు దఫాలు సీఎంగా ఉన్న మీరు, ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా పెట్టారా? కనీసం ఆ ఆలోచన చేశారా? మీరెలాగూ చేయలేదు. కనీసం మా ఐదేళ్ల అతికొద్ది కాలంలో మేము పెట్టిన 17 కాలేజీల్లో 5 చోట్ల కాలేజీలు పూర్తయి, క్లాసులు కూడా ప్రారంభం అయ్యాయి.
ఎన్నికలు ముగిశాక మరో చోట అడ్మిషన్లు కూడా జరిగాయి. మిగిలిన పనులు మీరు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి ఉంటే, గత ఏడాది మరో 5, ఈ ఏడాది మరో 7 కాలేజీల్లో కూడా క్లాసులు స్టార్ట్ అయ్యేవి కదా? మరి వాటిని ముందుకు తీసుకెళ్లకుండా ఈ రాష్ట్రానికి ఎందుకు ద్రోహం చేస్తున్నారు? ప్రస్తుతం ఈ కాలేజీల రాకతో అక్కడ అమాంతంగా విలువ పెరిగిన ఆ కాలేజీల భవనాలు, భూములు కొట్టేయడానికి మీరు వేసిన ప్లానే కదా ఇది? అవినీతి కోసం ఇంతగా తెగిస్తారా?
» మా ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2,360. ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా సీట్లు మరో 2,550 పెరిగి, 4,910కి చేరుకుంటాయి. మేం పూర్తి చేసి, క్లాసులు ప్రారంభించడంతో కొత్తగా సుమారు 800 సీట్లు భర్తీ కూడా అయ్యాయి. వైద్య విద్యలో ఇదొక అద్భుత కార్యక్రమం అయినప్పుడు దీన్ని దెబ్బ తీయడం ఎంత వరకు సమంజసం?
రాష్ట్రంలో అభివృద్ధికి, అత్యాధునిక వైద్యానికి చిరునామాగా నిలిచిన కాలేజీల్లో సగం సీట్లు ఉచితంగా, మరో సగం సీట్లు ప్రైవేటు వాళ్లతో పోలిస్తే తక్కువ ఫీజుతో విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి కదా? కళ్ల ముందే ఫలితాలు కనిపిస్తున్నా, ఈ కాలేజీలను ఎందుకు నాశనం చేస్తున్నారు? ఇక్కడ సరిపడా మెడికల్ సీట్లు లేక పోవడంతో తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలనుకుంటున్న తల్లిదండ్రులు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఇక్కడ ప్రయివేటు మెడికల్ సీట్లు కొనే స్తోమత లేక, ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్మి ఇతర రాష్ట్రాలకు, జార్జియా, ఉక్రెయిన్, రష్యా, పిలిప్ఫైన్స్ లాంటి ఇతర దేశాలకు పంపిస్తున్న మాట వాస్తవం కాదా?
ఇలాంటి పరిస్థితుల్లో కూడా పులివెందుల కాలేజీకి ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కౌన్సిల్) మెడికల్ సీట్లు ఇస్తే, వద్దంటూ మీరు లేఖ రాసినప్పుడే మీ కుట్ర ఏంటో బయటపడింది. పేదలకు ఆ జిల్లాలోనే ఉచితంగా సూపర్ స్పెషాలిటీ సేవలు అందాలన్న గొప్ప ఉద్దేశాన్ని నిలువునా దెబ్బ కొడుతున్నారెందుకు చంద్రబాబు గారూ?
» ప్రతి జిల్లాలో వైద్య ఆరోగ్య రంగంలో ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ రంగం కూడా ఉండాలని, అప్పుడే అక్కడ ఈ కొత్త కాలేజీల వల్ల అందుబాటులోకి వచ్చే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్లు, వివిధ రంగాల్లో ఫ్యాకల్టీలు, సూపర్ స్పెషాల్టీ సేవల కారణంగా మంచి మెడికల్ విద్యతోపాటు, ప్రజలకు కూడా వైద్యం ఉచితంగా అందుబాటులో ఉంటుందని తెలియదా? అప్పుడే ప్రభుత్వ రంగం, ప్రైవేటు ఆస్పత్రులు.. రెండూ సమతుల్యతతో, స్వయం సమృద్ధితో పని చేస్తాయన్న కనీస జ్ఞానం లేదా? లంచాల కోసం, కమీషన్ల కోసం కక్కుర్తితో ప్రజల ఆస్తులను ఇలా మీ వాళ్లకు పందేరం చేస్తారా? ఈ రాష్ట్రం మీ జాగీరు అనుకుంటున్నారా? ఎప్పటికీ మీరే కుర్చీలో ఉంటారని కలలు కంటున్నారా?
» రాష్ట్ర ప్రజలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని కూడా మీరు బతకనివ్వలేదు కదా చంద్రబాబు గారూ.. నెట్వర్క్ ఆస్పత్రులకు నెలకు ఇవ్వాల్సిన దాదాపు రూ.300 కోట్ల చొప్పున ఈ 15 నెలల్లో రూ.4,500 కోట్లకు గాను, కేవలం రూ.600 కోట్లు మాత్రమే ఇచ్చారు. దాదాపు రూ.4,000 కోట్లు ఎగ్గొట్టి, పేదవాడి ఆరోగ్య భద్రతను భ్రష్టు పట్టించారు.
వైద్యం ఖర్చు రూ.వేయి దాటితే 3,257 ప్రొసీజర్లకు ఉచిత వైద్యం అందించేలా, రూ.25 లక్షల వరకు ప్రభుత్వమే ఉచితంగా భరించేలా ప్రజల కోసం తీసుకొచ్చిన గొప్ప ఆరోగ్యశ్రీ పథకాన్ని నాశనం చేశారు. చివరకు ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి ఆ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5 వేలు అందించే ‘ఆరోగ్య ఆసరా’ను కూడా సమాధి చేశారు. దీనికి సంవత్సరానికి ఇవ్వాల్సిన రూ.450 కోట్లు, ఈ 15 నెలలకుగాను దాదాపుగా రూ.600 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు.
» ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి మీరు తప్పుకుని ప్రైవేటుకు ఇవ్వడం, అదో ఘన కార్యంగా ప్రచారం చేయించుకోవడం సిగ్గుగా లేదా? మా ప్రభుత్వ హయాంలోనే సంవత్సరాదాయం రూ.5 లక్షల లోపు ఉన్న వారందరికీ వర్తింప చేయడం ద్వారా మొత్తంగా రాష్ట్రంలో 95% కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. ఇది వాస్తవం కాదా? ఇక మీరు కొత్తగా చేసేది ఏముంది? మీ ఎల్లో మీడియాలో మోసం చేయడానికి డబ్బా కొట్టుకోవడం ఏంటి?
ఒక్కోచోట, ఒక్కోమాదిరిగా మోసం చేసేందుకు ప్రచారం చేస్తున్నారు. అసలు మీ ఇన్సూరెన్స్ పథకం పరిధి రూ.2.5 లక్షలకేనా? లేక రూ.25 లక్షలకా? అసలు ఈ 3,257 ప్రొసీజర్లు అంటే.. ఆపరేషన్ల ఖర్చు రూ.25 లక్షలదాకా ఉచితం అంటే అప్పుడు ప్రభుత్వం కట్టాల్సిన ప్రీమియం ఏ రూ.5 వేల కోట్లో దాటుతుంది. ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద రూ.3,600 కోట్లు ఖర్చు చేయడానికే మనసు లేనివారు... ఇక రూ.5 వేల కోట్లు ప్రీమియంగా ఖర్చు చేస్తారా? ఇది నమ్మదగ్గ విషయమేనా? అంటే దీని అర్థం మళ్లీ మోసం.
» ఒక బాధ్యతగా ప్రభుత్వం చేసే పనికీ, ప్రైవేటు కంపెనీలు చేసే పనికీ తేడా ఉంటుంది కదా చంద్రబాబు గారూ. దేశంలో అనేక ఆరోగ్య బీమా సంస్థల నుంచి క్లెయిముల పరిష్కారంలో వస్తున్న ఇబ్బందులు తెలియనివా? లాభాలు లేకుండా వారు ఇన్సూరెన్స్ వ్యాపారం చేస్తారా? కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు అన్ని ఆరోగ్య బీమా కంపెనీలు, ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేస్తే.. రాష్ట్ర ప్రభుత్వమే ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చికిత్స అందించింది.
ఇప్పుడు అలాంటి వెసులుబాటు ఉంటుందా? చికిత్సల జాబితాలో లేకపోయినా, ఏ కొత్త వ్యాధి అయినా ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని వినియోగించుకుని వెంటనే ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందించే అవకాశాన్ని ప్రజలు ఇప్పుడు కోల్పోతారు కదా.. కేవలం ప్రీమియం పేరిట మీ మనుషులకు చెందిన కంపెనీలకు దోచిపెట్టడానికే మీ ఈ నిర్ణయాలనే ఆరోపణలకు మీ సమాధానం ఏంటి?
» చంద్రబాబు గారూ.. ఇన్ని పాపాలు చేస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరు. ఇప్పటికే మీ పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మేం అధికారంలోకి రాగానే ఈ నిర్ణయాలను రద్దు చేస్తాం. ఈ కాలేజీలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తెచ్చుకుంటాం.