
వైఎస్సార్సీపీ నేతలు మండిపాటు
నేరమయ రాజకీయాలకు చంద్రబాబే ఆద్యుడు
నిత్యం బురద చల్లుతూ డైవర్షన్ పాలిటిక్స్
బాబు తీరు అంతా ఆత్మస్తుతి.. పరనింద
సాక్షి, అమరావతి: ఏడాది పాలనలో తాను ప్రజలకు ఏం చేశానో చెప్పుకోవడానికి ఏమీ లేక ఇవాళ్టికీ చంద్రబాబు నిత్యం బురద చల్లుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఏడాది పాలన అంతా అరాచకమే అని వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, కారుమూరి నాగేశ్వరరావు, పి.అనిల్కుమార్ యాదవ్, మేరుగు నాగార్జున, పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. ‘క్రిమినౖలెజేషన్ ఆఫ్ పాలిటిక్స్’కు ఆద్యుడు చంద్రబాబే అనే సంగతి అందరికీ తెలిసిందేనన్నారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్రమంతా వేడుకలు నిర్వహించాలని ఆదేశించడమే కాకుండా, చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ యథావిథిగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై, మాజీ సీఎం వైఎస్ జగన్పై నిందలు మోపుతూ.. నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రసంగమంతా ఆత్మస్తుతి.. పరనిందగా సాగిందని, డైవర్షన్ పాలిటిక్స్ను నమ్ముకుని ముందుకెళుతున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు గురువారం వారు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
‘వంగవీటి మోహన రంగా హత్య వెనుక ఎవరున్నారో నాడు రాష్ట్ర హోం మంత్రిగా పని చేసిన చేగొండి హరిరామజోగయ్య స్వయంగా చెప్పారు. వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి హత్య కేసులో నిందితులకు ఆశ్రయం ఇచ్చి, వారిని దాచి పెట్టిన వ్యక్తి చంద్రబాబు కాదా? వైఎస్ వివేకానందరెడ్డి హత్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది.
ఆ కేసును ఉద్దేశ పూర్వకంగా రాజకీయంగా వాడుకుని, తామే హత్య చేశామని టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో చెప్పిన వారిని కూడా అప్రూవర్గా మార్చి, ఆ నెపాన్ని నిర్దోషుల మీద మోపి రాజకీయ విష క్రీడ ఆడుతున్నది ఎవరో ప్రజలకు తెలిసిందే. తెల్గీ స్టాంప్ పేపర్ల స్కామ్ మొదలు.. స్కిల్ స్కామ్, మద్యం స్కామ్ వరకు ఏ నేరం చూసినా సరే చంద్రబాబు పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది’ అని తెలిపారు. వారు ఇంకా ఏం చెప్పారంటే..
కూటమి ప్రభుత్వంలో 390 హత్యలు
» ఏడాదిగా చంద్రబాబు అత్యంత హేయమైన పాలన సాగించారు. విపక్ష నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా హత్యలు, హత్యా యత్నాలు, ఆస్తుల విధ్వంసంతోపాటు టార్గెట్ చేసుకున్న వారిపై అక్రమ కేసుల బనాయింపునకు బరితెగించారు.
» ఏడాదిలో 390 హత్యలు. హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు 766 మంది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2,466. జైలుకు వెళ్లిన నాయకులు, కార్యకర్తలు 500 మంది. అక్రమ కేసులు నమోదైన సోషల్ మీడియా యాక్టివిస్టులు 440 మంది. కేసులు నమోదై జైలుకు వెళ్లిన సోషల్ మీడియా యాక్టివిస్టులు 79 మంది. దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది. జర్నలిస్టులపై అక్రమ కేసులు 63. మహిళలపై లైంగిక దాడులు 198. ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు 73. ఇద్దరు ప్రజా సంఘాల నాయకులు, ఎనిమిది మంది జర్నలిస్టులు జైలుకు వెళ్లారు.
» విద్యార్థి దశలో ఉన్నప్పుడే తన సహచరులకు మద్యం పట్టించి ప్రత్యర్థులపైకి దండయాత్రకు పంపానని చంద్రబాబు స్వయంగా తన ఎల్లో మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మామ కాళ్లు పట్టుకుని టీడీపీలోకి వచ్చాక.. ఆయన చేసిన నిర్వాకాలన్నింటినీ ఆయన తోడల్లుడు చెప్పారు. జర్నలిస్ట్ పింగళి దశరథరాం హత్య వెనుక ఎవరున్నారో కూడా అందరికీ తెలిసిందే.
» వైఎస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కోసం పొదిలి వెళితే టీడీపీ కార్యకర్తలతో దాడులు చేయించి, రాజకీయ హింసను రాజేసి ఆ మంటల్లో చలి కాచుకుందామని కుట్ర పన్నారు. అది ఫలించకపోవడంతో రైతులపై రౌడీలుగా ముద్ర వేసి, వారిపై కేసులు పెట్టి కక్ష సాధిస్తున్న చంద్రబాబువి నేరమయ రాజకీయాలు కావా?.