సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నేడు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరుగుతుండగా.. పెద్దారెడ్డికి పోటీగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పెద్దారెడ్డికి అనుమతి లేదంటూ ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
వివరాల ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం ఉదయం చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన ప్రదర్శనకు హాజరయ్యేందుకు బయలుదేరగా ఆయనను తాడిపత్రి పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, ఆయన బయటకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో తనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
అయితే, తాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పర్యటనలకు ఇప్పటికే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడంపై పార్టీ నేతలు, స్థానికులు.. పోలీసులు తీరుపై మండిపడుతున్నారు. టీడీపీ నేతలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.



