తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(మంగళవారం, డిసంబర్ 16వ తేదీ) విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు. ఇళ్లు కోల్పోయిన జోజినగర్ బాధితులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
భవానీపురం జోజినగర్కు చెందిన 42 ప్లాట్లకు చెందిన బాధితులు ఇటీవల వైఎస్ జగన్ను కలిశారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి అండగా ఉంటానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. దీనిలో భాగంగా ఇళ్లు కూల్చిన ప్రాంతాన్ని వైఎస్ జగన్ పరిశీలించనున్నారు.
అండగా ఉంటానని వైఎస్ జగన్ హామీ..
విజయవాడలోని జోజినగర్లో 42 ప్లాట్ల కూల్చివేత బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. కూల్చివేతకు గురైన 42 ప్లాట్లకు సంబంధించిన బాధితులు గురువారం(డిసెంబర్ 11వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ కష్టార్జితాన్ని నేలపాలు చేశారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.
పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి, బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని 25 ఏళ్ల క్రితం భవనాలు నిర్మించుకుంటే నిర్ధాక్షిణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ , ఇంటి పన్ను, కరెంట్ బిల్లుల రశీదులను చూపించారు. డిసెంబర్ 31 వరకు తమ ఇళ్ల జోలికి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా అధికారులు పట్టించుకోకుండా డిసెంబర్ 3వ తేదీ వేకువజామున వందల సంఖ్యలో పోలీసులొచ్చి తమ ఇళ్లను నేలమట్టం చేసి వెళ్లిపోయారని బాధితులు వాపోయారు.
అధికార టీడీపీ, జనసేన నాయకులను కలిసినా తమ గోడు వినిపించుకోలేదని, ఇళ్లు కూల్చివేస్తే ఎంపీ, ఎమ్మెల్యే కనీసం పరామర్శకు కూడా రాలేదని కన్నీరుమున్నీరయ్యారు. మీరే న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. బాధితులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని, న్యాయ సహాయం అందిస్తుందని ధైర్యంచెప్పారు. వచ్చేవారం తాను వచ్చి కూల్చి వేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తానని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి:
‘ఇది కదా ప్రజా ఉద్యమం అంటే..!’


