సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఖాజీపేట ఇంటర్ బాలిక హత్య కేసులో బిగ్ట్విస్ట్ చోటుచేసుకుంది. నిందితుడు వెంకటేష్ తల్లి సుజాత.. మీడియా ముందుకొచ్చారు. తన కుమారుడు, కీర్తనకు మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టు తనకు తెలియదన్నారు. తన కొడుకు జేబులో ఒక లెటర్ దొరికింది. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని తెలుస్తోందని ఆమె తెలిపారు.
‘‘నా కుమారుడు కీర్తన వెంట తిరుగుతున్నట్టు ఆమె తల్లిదండ్రులకు తెలిసినా.. నాకెప్పుడూ చెప్పలేదు. హత్య జరిగిన రోజు బయటకు వెళ్లి కొద్దిసేపటికే నా కొడుకు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చాక నన్ను గుండెలకు హత్తుకొని ఏడ్చాడు. నా ప్రేమ విషయంలో కీర్తన మోసం చేసిందని ఆడగటానికి వెళ్తే కత్తి తీసుకొని గొంతు కోసుకుంటానని బెదిరించిందని చెప్పాడు. ఈ పెనుగులాటలో కీర్తన గొంతు తెగిందని ఏమైందో తర్వాత తనకు తెలియదని భయంతో వచ్చానని చెప్పాడు. నా కొడుకు అమాయకుడు. ఇంతటి ఘోరం చేసుంటాడని అనుకోవడం లేదు. చట్టపరంగా నా కొడుకుని శిక్షించండి. మరో రకంగా వద్దు. మరో రకంగా శిక్షించేటట్లయితే... నా కుమారుడితో పాటు నన్నూ శిక్షించండి’’ అంటూ సుజాత పేర్కొంది.
తన కొడుకు చంపాలని వెళ్లి ఉంటే కత్తి తీసుకువెళ్ళేవాడు కదా అంటూ తల్లి ప్రశ్నిస్తోంది. పెనుగులాటలో పొరపాటున ప్రమాదం జరిగిందని కొడుకు తనకు చెప్పాడన్న తల్లి.. ముందే బాలికను పెళ్లి చేసుకుంటానని తన కొడుకు ఆమె తండ్రిని అడిగాడని సుజాత అంటోంది. ‘‘ప్రేమించుకున్నాం కదా పారిపోయి పెళ్లి చేసుకుందామని నా కుమారుడు అడిగాడు. బాలిక రానని చెప్పింది. ఆమెకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. తన కుమారుడిని ఎన్కౌంటర్ చేస్తారని పుకార్లు ఉన్నాయి. చట్టప్రకారం తప్పుచేసి ఉంటే శిక్షించండి. ఎన్కౌంటర్ చేస్తే.. నన్ను కూడా చంపేయండి’’ అంటూ వెంకటేష్ తల్లి వ్యాఖ్యానించారు.


