స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించనున్న వైఎస్సార్సీపీ అధినేత
సాక్షి,అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించి, ధైర్యం చెప్పనున్నారు. ప్రమాద ఘటన గురించి సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని వైఎస్సార్సీపీ నేతలను వైఎస్ జగన్ ఆదేశించారు.
ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న వైఎస్ జగన్.. బుధవారం విశాఖకు చేరుకొని బాధితులను పరామర్శిస్తారని వైఎస్సార్సీపీ తెలిపింది.


