చంద్రబాబును కడిగి పారేసిన వైఎస్ జగన్
మా కుటుంబంలో ముగ్గురిని కోల్పోయాం
మా తాతను చంపిందెవరు? వారిని కాపాడిందెవరు?
మా నాన్ననూ అసెంబ్లీలో బెదిరించింది మీరు కాదా? ఆ తర్వాత ఒకటి, రెండు రోజుల్లోనే ఆయన మరణం నిజం కాదా?
మా బాబాయి వివేకానందరెడ్డిని ఎవరు చంపారు?
ఆ హత్య చేసిన వ్యక్తి పోలీస్ వత్తాసుతో తిరుగుతున్నాడు
తానే హత్య చేసినట్లు మీడియా ఇంటర్వ్యూల్లో చెప్పాడు
జైల్లో ఉండాల్సిన దస్తగిరి బయట ఎందుకున్నాడు?
దస్తగిరికి వాదిస్తున్నది మీ ఖరీదైన లాయర్ లూథ్రా కాదా?
మల్లెల బాబ్జీ మొదలు ఇటీవలి రాజకీయ హత్యల వెనుకున్నదెవరు?
వంగవీటి రంగా, పింగళి దశరథరామ్ను చంపిందెవరు?
అన్నింటిలోనూ వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపిస్తున్నాయి
హరికృష్ణ శవం పక్కన కేటీఆర్తో రాజకీయ మంతనాలు నిజం కాదా?.. చెప్పండి ఎవరివి హత్యా రాజకీయాలు?
రెండేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కనిపిస్తోంది. ప్రతిసారి ప్రజలను వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోంది. వీటిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఒక అంశంపై గట్టిగా ప్రశ్నిస్తే టాపిక్ డైవర్ట్ చేసేందుకు వైఎస్సార్సీపీపై, నాపై (జగన్పై) అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు. రెండేళ్లుగా ఇదే స్క్రిప్టు, స్క్రీన్ ప్లే, సినిమా చూస్తున్నాం. ఈ మధ్య చంద్రబాబుకు పదేపదే రక్తపోటు (బీపీ) పెరుగుతోంది. బాబు నిద్రలో ఉండగా మావిగన్ అంటే చాలు గుండె ఆగి పోయేంతగా బీపీ పెరుగుతోంది. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ‘రెండేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు వెన్నుపోట్లు పొడుస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతూనే ఉంది. వీటన్నింటి నుంచి ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం పరిపాటిగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద, నా మీద అడ్డగోలుగా ఆరోపణలు చేయడం, టాపిక్ డైవర్ట్ చేయడం మామూలైపోయింది. ఎవరిది గన్ కల్చర్.. ఎవరివి హత్యా రాజకీయాలు’ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లుగా హత్యారాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, డైవర్షన్ పాలిటిక్స్ కోసం అక్రమ కేసులు పెడుతూ రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేసిన తీరును సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..
తప్పుడు కేసులు.. దొంగ సాక్ష్యాలు
కడపలో మా పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యకు గురైతే.. ఆ కేసును పూర్తిగా ట్విస్ట్ చేసి మా పార్టీపైనే బురద జల్లేందుకు వాడుతున్నారు. మా పార్టీకి చెందిన డిప్యూటీ మేయర్గా పనిచేసిన నిత్యానందరెడ్డి, మా మామ రవీంద్రనాథ్రెడ్డిపై బురద జల్లుతున్నారు. జాతరలో గొడవ వల్ల ఈ హత్య జరిగిందని దస్తగిరి భార్య మీడియా ఎదుట చెప్పింది. తామెవరికి బినామీ కాదని, డిప్యూటీ మేయర్గా పని చేస్తున్న నిత్యానందరెడ్డితో తమకు ఎలాంటి విబేధాలు లేవని కూడా చెప్పింది. ఇక్కడ వైఎస్సార్సీపీ కార్యకర్తలందరూ కలిసికట్టుగా ఉన్నారు.
చనిపోతే బాధ పడాల్సింది మా వాళ్లే. అయినా సరే చంద్రబాబు తన రాజకీయాల కోసం టాపిక్ డైవర్షన్ చేసేందుకు, వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు కుట్రలతో దిగజారుతున్నారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 అందరూ కలిసి ఒక కథ తయారు చేస్తారు. దాన్నే నిజమని చెబుతారు. పెద్దపెద్ద అక్షరాలతో రాస్తారు. అధికారంలో ఉన్నారు కాబట్టి వ్యవస్థలన్నీ వీళ్ల చేతుల్లో ఉన్నాయి. గతంలో వేరే రకంగా ఇచ్చి న స్టేట్మెంట్లను తీసుకుని, ఇప్పుడు చంద్రబాబు బృందం చెప్పిన కల్పిత కథల చుట్టూ కేసు బిల్డప్ చేస్తారు. దొంగ సాక్ష్యాలను సృష్టిస్తారు. కొంత మందిని కేసులో ఇరికిస్తారు. అరెస్ట్ చేస్తారు.
ఓ వైపు దస్తగిరి భార్య బయటకొచ్చి జరిగిన విషయమంతా చెప్పి బాధ పడుతుంటే, మా వాళ్ల మీదే కేసులు బనాయించి, ఆ కేసుల్లో మా వాళ్లను ఇరికించి జైలుకు పంపే కార్యక్రమం చేస్తున్నారు. రెండేళ్లుగా జరుగుతున్న అరాచకాలు ఇవే. తప్పుడు కేసులు వీళ్లే పెడతారు. తప్పుడు సాక్ష్యాలు వీళ్లే క్రియేట్ చేస్తారు. ఆ కేసుల్లో మా వాళ్లను ఇరికిస్తారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్లు అయినా సరే, కళాశాలలు, యూనివర్సిటీల్లో యాక్టివిస్ట్లుగా ఉన్న పిల్లలైనా సరే, వైఎస్సార్సీపీకి మద్దతుదారులైనా సరే, వైఎస్సార్సీపీ నాయకులైనా సరే చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే చాలు.. ఇదే స్క్రిప్ట్.
చంద్రబాబు లాయర్.. దస్తగిరి లాయర్ సిద్ధార్థ లూథ్రాయే
మా చిన్నాన్న వివేకానందరెడ్డి ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా? వైఎస్సార్సీపీ కోసం, అవినాష్ రెడ్డి కోసం జమ్మలమడుగులో ప్రచారం చేసి వచ్చిన రోజే హత్యకు గురయ్యారు. పైగా తానే వివేకానంద రెడ్డిని హత్య చేశానంటూ సాక్షాత్తు టీవీలో ప్రత్యక్ష ప్రసారంలోనే విచ్చలవిడిగా మాట్లాడిన దస్తగిరి అనే ఈ వ్యక్తి, మా చిన్నాన్నను చంపిన వ్యక్తి. ఈరోజు స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతున్నాడు.
చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రానే దస్తగిరి లాయర్ కూడా. ఎవరిదయ్యా చంద్రబాబూ క్రిమినల్ బ్రెయిన్? రాజకీయ లబ్ధి కోసం ప్రలోభాలతో హంతకులను రక్షించడం, నిర్దోషులను హింసించడం ఇదే కదా.. ఈ కేసులో జరుగుతోంది. చంద్రబాబు బావమరిది, ఆయన వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని టపా.. టపా.. అని ఇద్దరిని కాల్చిపడేయ లేదా? ఎవరిదయ్యా గన్ కల్చర్ అని అడుగుతున్నా. ఆ తర్వాత సాక్షులు ఉండకూడదన్న ఆలోచనతో ఇంట్లోని వాచ్మేన్ను ఘటన జరిగిన కొద్ది రోజులకే బండరాయితో మోది చంపలేదా?
ఎన్టీఆర్ గారి అబ్బాయి హరికృష్ణ యాక్సిడెంట్లో చనిపోతే.. పరామర్శ కోసం పోయి చంద్రబాబు ఇంట్లో శవాన్ని పెట్టుకొని కేటీఆర్తో పొత్తుల కోసం మాట్లాడ లేదా? ఎవరివయ్యా శవ రాజకీయాలు అని అడుగుతున్నా. సొంత కూతురిని ఇచ్చి, రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన సొంత మామను, తండ్రితో సమానమైన ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, పార్టీని, చివరికి గుర్తును కూడా లాక్కొని, ఆయన చనిపోయేలా చేసింది ఎవరయ్యా? చంద్రబాబు కాదా? ఎవరివయ్యా కుట్ర రాజకీయాలు అని అడుగుతున్నా.
వంగవీటి హత్యలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే
వంగవీటి మోహనరంగారావు ఒక టైగర్. ఆయన ఎలా చనిపోయారు? పేదలకు ఇళ్ల పట్టాల కోసం విజయవాడలో «నిరాహార దీక్ష చేస్తుంటే.. అర్ధరాత్రి అత్యంత పాశవికంగా నరికి చంపారు. అప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీ కాదా? ఈ ఘటనలో వేళ్లన్నీ కూడా చంద్రబాబు వైపే చూపిస్తాయి. హరిరామ జోగయ్య అప్పట్లో మంత్రి, చంద్రబాబుకు సహచరుడు. ఆయన రాసిన పుస్తకంలో ఈ ఘటన ఎలా జరిగింది.. చంద్రబాబు పాత్ర ఎంత బలంగా ఉందో రాశారు. మోహన రంగా హత్య కేసులో ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణబాబు ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేనే.
హత్యా రాజకీయాలు ఎవరివో.. కుట్ర రాజకీయాలు ఎవరివో.. శవ రాజకీయాలు ఎవరివో ప్రజలకు తేటతెల్లమవుతున్నాయి. ఎన్టీఆర్పై దాడి కేసులో మల్లెల బాబ్జీని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల తర్వాత ఆయన లాడ్జిలో శవంగా మారాడు. అతని జేబులో దొరికిన లెటర్లో తనకు రూ.3 లక్షలు ఇస్తానని చెప్పి చివరికి రూ.30 వేలు ఇచ్చారని రాసి ఉంది. ఎన్టీఆర్పై దాడి కోసమే ఈ డబ్బులు ఇచ్చారా? అదే నిజమైతే ఇచ్చింది ఎవరు? అన్న దానిపై దర్యాప్తు లేదు.
ఈ కేసులో వేళ్లన్నీ అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి. మరొక ఉదాహరణ..పింగళి దశరథరామ్. ఈయన ఒక ప్రముఖ జర్నలిస్టు. విజయవాడలో ఎన్కౌంటర్ అనే పత్రిక పెట్టి, టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న ఈ వ్యక్తి హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చి రిక్షాలో ఇంటికి వెళ్తుంటే కత్తులతో దాడి చేసి దారుణంగా చంపారు. ఈ ఘటనలో వేళ్లన్నీ అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి. ఎవరివి హత్యా రాజకీయాలు.. ఎవరివయ్యా కుట్ర రాజకీయాలు.. ఎవరివయ్యా శవ రాజకీయాలు?
అబద్ధాలు.. దొంగ కేసులు.. తప్పుడు సాక్ష్యాలు
ఎప్పుడు ఏ ఘటన జరిగినా, వెంటనే చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులు డైవర్షన్ చేసేందుకు కొత్త టాపిక్ను, కొత్త అబద్ధాన్ని తెరపైకి తీసుకొస్తారు. దానికి రెక్కలు కడతారు. ఇష్టమొచ్చి నట్టుగా మాట్లాడతారు. ఇంకొక విస్తుగొలిపే విషయం.. రెండ్రోజుల క్రితం ఈనాడులో చూశాను. నకిలీ మద్యం కేసులో 89 మంది సాక్షులట.. జోగి రమేష్ పేరు చెప్పారట! ఈ కల్తీ మద్యం ఘటన జరిగింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో. కల్తీ మద్యం తయారు చేసిన వాళ్లకు, పోలీసుల మధ్య లావాదేవీల్లో తేడా వచ్చి ఈ విషయం బయటకొచ్చింది.
చంద్రబాబు హయాంలో కొనసాగుతున్న కల్తీ మద్యం ఫ్యాక్టరీలు.. ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నరేళ్ల తర్వాత బయట పడిన విషయాలివి. తంబళ్లపల్లిలో చంద్రబాబు పార్టీ తరఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తన సన్నిహితుల పీఏల ఆధ్వర్యంలో కల్తీ మద్యం తయారు చేస్తే.. పోలీసులు రైడ్ చేస్తే అడ్డంగా దొరికి పోయారు. అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వం. చేసింది చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యే అభ్యరి్థ. కానీ కేసు మాత్రం మా పార్టీ నేత జోగి రమేష్పైనే బనాయించారు.
నిజంగా మనుషుల్లో మానవత్వం ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నా. ఒక అబద్ధానికి రెక్కలు గట్టి ఇష్టమొచ్చి నట్టుగా ఇరికించేస్తున్నారు. జోగి రమేష్ను బీసీ నాయకుడు అని కూడా చూడకుండా ఓ తప్పుడు కేసులో 83 రోజులు జైలులో పెట్టారు. బెయిల్పై బయటకొస్తే ఇంటిపై యాసిడ్ బాటిల్స్తో దాడి చేయించారు. ఆ దాడి చేసిన వాళ్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఈ రోజు చార్జిషీట్ ఫైల్ చేసారట.. 89 మంది సాక్షులట. జోగిరమేష్ పేరు చెప్పారట. నిజంగా ఎంత దారుణంగా కేసులు బిల్డప్ చేస్తున్నారో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు.
కుట్రలు, కుతంత్రాలు, హత్యా రాజకీయాలు, ఇరికించడాలు, ప్రలోభాలు, బెదిరించడాలు రెండేళ్లుగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఐదు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ బాటిల్ అమ్ముతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పెరగడం లేదు. ఈ కల్తీ మద్యం తయారు చేసేది చంద్రబాబు హయాంలోనే. అమ్మేది చంద్రబాబు మాఫియా ముఠా బెల్టు షాపులు. ఇవన్నీ పోలీసులకు తెలుసు. బెల్టుషాపులు నడుపుతున్నారని, ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని, ప్రతీ ఐదు బాటి ల్స్కు ఒక బాటిల్ కల్తీ అని అందరికీ తెలుసు. అయినా అటువైపు పోలీసులు, అధికారులు కన్నెత్తి చూడరు.
అంబటి మురళీపైనే తప్పుడు కేసులు
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో చాలా దారుణమైన ఘటన. భావి సమాజం ఖండించాల్సిన అంశం. మామిళ్లపల్లిలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు చిన్న రైతులు తాము పండించిన మొక్కజొన్న పంటకు రేటు లేదని ఊళ్లోని గోదాములో దాచుకున్నారు. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) చూస్తే రూ.2,400. కానీ రూ.1,400, రూ.1,600కు మించి ధర రావడం లేదు. అందుకే ఊళ్లోని గోదాములో దాచుకున్నారు. ఆ గోదాము ఉన్నది మా పార్టీకి చెందిన అంబటి మురళి ఇంటి పక్కన. ఆయనది అదే ఊరు. ఆయన కూడా కాపు నాయకుడే. కానీ స్థానిక ఎమ్మెల్యే, చంద్రబాబు పోలీసులను పంపుతారు. గోడౌన్పై రైడ్ చేయిస్తారు. ఆ గోడౌన్కు వైఎస్సార్సీపీ జెండాలు కట్టిస్తారు.
అభాండాలు వేసి, అబద్ధాలు చెప్పించి మొక్కజొన్న నిల్వ చేశారంటూ గోడౌన్ను సీజ్ చేశారు. నాకు ఆశ్చర్యమనిపిస్తుంది. రేటు లేక దాచుకుంటే సీజ్ చేస్తున్నారు. నువ్వు ఎమ్మెస్పీ ఇచ్చి కొంటామంటే ఎందుకు దాచుకుంటారు? ఏం తప్పు చేశారని గోడౌన్ సీజ్ చేశారు? ఆ రైతులకు ఈ రోజు పంట లేదు. చేతిలో డబ్బుల్లేవు. వైఎస్సార్సీపీ నాయకులు, ఇతరులు ఆ గోడౌన్ను చూడడానికి వెళ్తే అడ్డగిస్తున్నారు. జంగిల్ రాజ్ కాకపోతే ఏమిటిది? దొంగ కేసులు, తప్పుడు సాక్ష్యాలు.
మా కుటుంబంలో ముగ్గురిని కోల్పోయాం
చంద్రబాబూ.. ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది గన్ కల్చర్? ఎవరివయ్యా హత్యా రాజకీయాలు? మా కుటుంబంలో మేము ముగ్గురిని కోల్పోయాం. మా తాత, మా నాన్న, మా చిన్నాన్న బలైపోయారు. మేము బాధితులం. కానీ మా పైనే చంద్రబాబు తప్పుడు రాజకీయాలు చేస్తున్నాడు. మా తాత రాజారెడ్డిని చంపింది ఎవరు? టీడీపీ వాళ్లు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాదా? 1999 ఎన్నికలకు ముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మా తాత రాజారెడ్డిని దారుణంగా చంపారు.
కేవలం మా నాన్న రాజశేఖరరెడ్డిని పులివెందులలో కట్టడి చేయాలనే ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఆ కేసులో దోషులను హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ కార్యాలయంలో దాచిపెట్టి జైలుకు పంపకుండా రక్షించింది వీళ్లు కాదా? అధికార దుర్వినియోగం చేసింది వీళ్లు కాదా? ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతున్నా.
మా నాన్న విషయంలోనూ అంతే. నాన్న చనిపోక ముందు జరిగిన అసెంబ్లీ సమావేశాల క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి. ‘నువ్వు అసెంబ్లీ సమావేశానికి ఎలా వస్తావో నేను చూస్తా’ అని చంద్రబాబు అన్న మాటలు నాకు గుర్తున్నాయి. ఈ మాటలన్న 2–3 రోజులకు నాన్న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఇప్పటికీ ఈ ఘటనలో నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతున్నా.
వీటినేమంటారు?
» కడపలో మా పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యకు గురైతే.. ఆ కేసును పూర్తిగా ట్విస్ట్ చేసి మా పార్టీపైనే బురద జల్లేందుకు వాడుతున్నారు. మృతుడు దస్తగిరి భార్య బయటకొచ్చి జరిగిన విషయమంతా చెప్పి బాధ పడుతున్నా, మా వాళ్ల మీదే కేసులు బనాయించారు.
» మా తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా? ఈ ఘటన 1999 ఎన్న్నికల ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాదా? ఆ కేసులో దోషులను హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉంచి కాపాడలేదా?
» మా నాన్నను ‘నువ్వు అసెంబ్లీ సమావేశానికి ఎలా వస్తావో నేను చూస్తా’ అని చంద్రబాబు బెదిరించడం.. ఆ మాటలన్న 2ృ3 రోజులకు నాన్న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం నిజం కాదా?
» మా చిన్నాన్న వివేకానందరెడ్డి ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా?
» మా చిన్నాన్నను చంపిన వ్యక్తి ఈరోజు స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతున్నాడు. చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రానే దస్తగిరి లాయర్ కూడా.
» చంద్రబాబు బావమరిది, వియ్యంకుడైన బాలకృష్ణ గన్ పట్టుకొని టపా.. టపా.. అని ఇద్దరిని కాల్చిపడేయ లేదా?
» ఆ తర్వాత సాక్షులు ఉండకూడదన్న ఆలోచనతో ఇంట్లోని వాచ్మేన్ను ఘటన జరిగిన కొద్ది రోజులకే బండరాయితో కొట్టి చంపలేదా?
» ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ యాక్సిడెంట్లో చనిపోతే.. ఇంట్లో శవాన్ని పెట్టుకొని కేటీఆర్తో పొత్తుల కోసం మాట్లాడింది చంద్రబాబు కాదా?
» సొంత మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, పార్టీని, చివరికి గుర్తును కూడా లాక్కున్నదెవరు?
» వంగవీటి మోహన్ రంగా హత్యలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపుతున్నాయి. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణబాబు ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేనే.
» మల్లెల బాబ్జీ ఎందుకు లాడ్జిలో శవంగా మారాడు? అక్కడ దొరికిన నోట్లో ఏముంది? ఆ దిశగా ఎందుకు దర్యాప్తు చేయలేదు?
» జర్నలిస్ట్ పింగళి దశరథరామ్ను చంపిందెవరు? ఈ ఘటనలోనూ వేళ్లన్నీ అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి.
» నకిలీ మద్యం తయారు చేస్తూ పట్టుబడింది మీ పార్టీ లీడర్. కానీ కేసు మాత్రం మా పార్టీ నేత జోగి రమేష్పై ఎలా పెట్టారు?
» రెండేళ్లుగా కుట్రలు, కుతంత్రాలు, హత్యా రాజకీయాలు, ఇరికించడాలు, ప్రలోభాలు, బెదిరించడాలు.. ఊరూరా గంజాయి, డ్రగ్స్, బెల్ట్ షాపులు
బాబు నైజాన్ని దగ్గుబాటి, హరిరామజోగయ్య ఏనాడో చెప్పారు
ఇదే పెద్దమనిషి చంద్రబాబు గురించి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకం రాశాడు. ధర్నాలు, ఆందోళనల సమయంలో బస్సులు తగలబెట్టాలంటూ చంద్రబాబు పార్టీ కేడర్కు చెప్పేవాడని అనేక టీవీల్లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. బస్సులు తగలపెట్టకపోతే ధర్నాలు కావట! నేను కాదు అన్నది ఈ మాటలు.. స్వయంగా ఆయన తోడల్లుడు దగ్గుబాటి చెప్పిన మాటలు. తాను రాసిన పుస్తకంలో చంద్రబాబు కుట్రలు, రాక్షస రాజకీయాల గురించి వివరించారు. హరిరామజోగయ్య కూడా చంద్రబాబు ఏ రకంగా కుట్రలు చేస్తాడు.. ఎలాంటి రాక్షస రాజకీయాలు చేస్తాడో సవివరంగా తన పుస్తకంలో రాశాడు.
హత్యలతో, వెన్నుపోట్లతో, శవాలతో, కుట్రలతో రాజకీయాలు చేసింది.. చేస్తోంది చంద్రబాబు. విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తున్నది మేము. గర్వంగా చెబుతున్నాను నేను ఈ మాటలు. జగన్ మంచోడు కాబట్టే మా తాత రాజారెడ్డిని చంపినోళ్లు ఈ రోజు ప్రశాంతంగా బతుకుతున్నారు. జగన్ చెడ్డోడు అయి ఉంటే వాళ్లు బతికి ఉండేవాళ్లా? మా తాతని దారుణంగా నరికి చంపిన వాళ్లు ఇప్పటికీ ప్రశాంతంగా ఉన్నారు. జగన్ నైజం ఎలాంటిది.. జగన్ మనస్తత్వం ఎలాంటిది.. అని చెప్పేందుకు ఇదొక నిదర్శనం. వారికి ఎప్పటికీ ఏమీ కాదు. ఎందుకంటే మాకు రాజకీయాలు ఎలా చేయాలో మా నాన్న నేర్పించారు.
చంద్రబాబు మాదిరి హత్యలు చేయమని కాదు. ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని నేర్పించారు. అది చంద్రబాబుకు, మాకు మ«ధ్య ఉన్న వ్యత్యాసం. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో? ఎవరికి గొడ్డళ్లు, గునపాలు అవసరమో.. ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబుకు 77 ఏళ్ల వయస్సు. బహుశా ఇవి చివరి ఎన్నికలనుకుంటున్నా. ఎన్నికలొచ్చేసరికి మీకు (చంద్రబాబు) 80 ఏళ్లు. ఈ వయసులో కూడా దౌర్భాగ్య రాజకీయాలు చేయడానికి సిగ్గుగా లేదా అని అడుగుతున్నా. ఈ రెండేళ్లలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను దారుణంగా చంపిన ఘటనలు ఎలా ఉన్నాయో గమనించండి.
వినుకొండలో 2024 జూలై 24న వైఎస్సార్సీపీ నేత రషీద్ను నడిరోడ్డుపై నరికి చంపించే కార్యక్రమాన్ని ఎలా ప్రోత్సహించారో చూస్తే అర్థమవుతుంది. ఇలా ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు. (రెండేళ్ల పాలనలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టీడీపీ నేతలు హత్య చేసిన ఉదంతాలను ఆధారాలతో సహా వివరించారు) చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఏ రకంగా హత్యలు చేయిస్తున్నాడో? కుట్రలు చేస్తున్నాడో? శవ రాజకీయాలు చేస్తున్నాడో? అందరికీ తెలుసు. ఎవరిది గొడ్డలి పార్టీయో? గొడ్డలి పట్టుకొని ఎంత దారుణంగా హత్యలు చేయిస్తా ఉన్నాడో చెప్పేందుకు ఇవి నిదర్శనాలు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ సాగుతోంది. హత్యా రాజకీయాల మధ్య దారుణమైన పాలన సాగుతోంది.
చంద్రబాబు హత్యా రాజకీయాలకు సాక్ష్యాలు ఇవిగో...





