గిరిజన మహిళా నాయకుల మీద అనుచిత ప్రవర్తనపై వైఎస్ జగన్ ఆగ్రహం | YS Jagan Fires babu Govt For inappropriate behavior towards tribal women leaders | Sakshi
Sakshi News home page

గిరిజన మహిళా నాయకుల మీద అనుచిత ప్రవర్తనపై వైఎస్ జగన్ ఆగ్రహం

Sep 1 2026 11:24 PM | Updated on Sep 1 2026 11:44 PM

YS Jagan Fires babu Govt For inappropriate behavior towards tribal women leaders

సాక్షి, తాడేపల్లి: గిరిజన మహిళా నాయకుల పట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణితో అనుచితంగా ప్రవర్తించడాన్ని ఆయన తప్పుబట్టారు. గిరిజన మహిళా నాయకుల పట్ల వ్యవహరించిన తీరుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని మారికవలస వద్ద ఉన్న గిరిజన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌ను తరలించవద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు వారికి మద్దతుగా నిలిచారని జగన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారిని గృహ నిర్బంధాలకు గురిచేయడం, పోలీసుల బలంతో వారి గొంతును నొక్కే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. గిరిజన వర్గాలపై ఎందుకంత కక్ష? అంటూ సీఎం చంద్రబాబును వైఎస్ జగన్ ప్రశ్నించారు. విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున గొంతెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే వైఎస్సార్‌సీపీ నాయకులు చేసిన నేరమా అంటూ నిలదీశారు.

మారికవలస స్కూల్‌ తరలింపును వ్యతిరేకిస్తూ ఆగస్టు 20 నుంచి విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు గిరిజన సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వారి అభ్యంతరాలను పట్టించుకోవడం లేదు. బాగా నడుస్తున్న గిరిజన రెసిడెన్షియల్ స్కూల్‌ను తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది. వైఎస్సార్‌ హయాంలో ప్రముఖ విద్యావేత్త, అప్పటి ఎమ్మెల్సీ చుక్కా రామయ్య సూచనలతో ఎస్టీ విద్యార్థులు ఎన్‌ఐటీ, ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా ‘స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ కింద 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు నాణ్యమైన విద్య అందించేలా ఏడు గురుకులాలను ఏర్పాటు చేశారు.

క్వాలిఫైడ్‌ టీచర్స్‌ను పెట్టి, ఈ టీచర్లకు ప్రోత్సాహకాలు కూడా ఇచ్చి, వారి ద్వారా మంచి శిక్షణ ఇప్పించడం వల్ల గిరిజన విద్యార్థులు ఆ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు పొందారు. మా ప్రభుత్వంలో నాడు-నేడు ద్వారా వీటిని మరింతగా సౌకర్యాలను మరింత అభివృద్ధి చేయడమే కాక, ఆన్లైన్‌ కోచింగ్‌, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ఫామ్స్‌ ద్వారా వారికి అందించే బోధనను మరింత మెరుగుపరిచాం. మంచి ఫలితాలు కూడా సాధించాం. ఎన్‌ఐటీ, ఐఐటీల్లో సీట్లు పొందే ట్రైబల్‌ విద్యార్థులకు ప్రోత్సాహకంగా రూ.40వేలు, వారికి ల్యాప్‌టాప్‌లు ఇచ్చాం. ఇప్పుడు వీటిని పట్టించుకోకుండా బాగా నడుస్తున్న స్కూళ్లలో విద్యార్థులను బలవంతంగా తరలించి, ఎందుకు వారిని కష్టపెడుతున్నారు?

ప్రస్తుతం బాగా పనిచేస్తున్న పాఠశాలల నుంచి విద్యార్థులను బలవంతంగా తరలించడం వల్ల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖపట్నం వంటి నగరంలో గిరిజన విద్యార్థులకు చదువుకునే హక్కు లేదా. నెల్లూరు జిల్లా కోటలోని ఎస్సీ గురుకులం నుంచి కూడా వందలాది మంది విద్యార్థులను విద్యా సంవత్సరం మధ్యలోనే తరలించారు. భారీ సంఖ్యలో విద్యార్థులు ఉన్న నాలుగు గురుకులాల నుంచి 2 వేల మందికిపైగా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తూ చెల్లాచెదురు చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా?చంద్రబాబూ.. మీరు, మీ సుపుత్రుడి తలతిక్క పనులతో విద్యాశాఖను అస్తవ్యస్తం చేస్తున్నారు.

మీరు పెడతామంటున్న ఈ కొత్తవాటిలో ఇంటర్మీడియట్‌నుంచి ప్రత్యేక శిక్షణ అంటున్నారు. కానీ జేఈఈ, నీట్‌లాంటి పోటీ పరీక్షల్లో రాణించాలంటే, ఆ పరీక్షలు రాసే వారికి పునాది కనీసం 8వ తరగతి నుంచే ఉండాలి కదా? అలాంటి కాన్సెప్ట్‌తో పెట్టిన `స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లను నిర్వీర్యం చేయడం కరెక్టు కాదు. ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించుకుని,విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభ్యంతరాలను విని,ఆ పిల్లలకు నచ్చినచోటే చదువుకోనివ్వండి. గిరిజన మహిళా నాయకుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు క్షమాపణలు చెప్పాలని వైఎస్ జగన్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement