విజయవాడ: పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండిలో పేదల ఇళ్లు కూల్చివేతలకు నిరసనగా విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. రొయ్యల చెరువులకు తమ ఇళ్లు అడ్డువస్తున్నాయని చెప్పి కూల్చివేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాము ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను ఇలా అర్థంలేని కారణంతో గంటలో కూల్చివేయడం తాము పేదలం కాబట్టే చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
పేదల ఇల్లు కూల్చివేతకు నిరసనగా విజయవాడలో గురువారం(మే 28వ తేదీ) రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం కెవిపిఎస్ వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీని కోసం విజయవాడకు వచ్చిన బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఇళ్లు కూల్చివేత మానుకోవాలని, కూల్చిన ప్రతి ఇంటికి లెక్కగట్టి పరిహారం ఇవ్వాలని అంటున్నారు బాధితులు. సర్వం కోల్పోయిన తమకు న్యాయం చేయడమే కాకుండా రఘరామ కృష్ణంరాజు పై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు.
ఉందూరు మండలానికి చెందిన పద్మ అనే బాధితురాలు మాట్లాడుతూ.. ‘ 72 ఇల్లు కూల్చేశారు. 70 ఏళ్ళ నుండి అక్కడే ఉంటున్నాం. రొయ్యల చెరువులు పిటిషన్ పెట్టారని కూల్చారు. అందరికి పిటిషన్ పెట్టాం..కనీసం కనికరం చూపించలేదు. నడిరోడ్డు మీద ఇప్పుడు నిలబడ్డం. ఇల్లు కట్టుకొని సంవత్సరం అయ్యింది. రఘురామ కృష్ణం రాజు భార్య గారిని అడిగాం. ఆవిడా కూడా దారుణంగా మాట్లాడారు. అక్వా రైతులకు అడ్డం గా ఉన్నామని కూల్చేశారు. కలెక్టర్, లోకేష్, చంద్రబాబు ఇంటికి వెళ్ళాం. చంపేస్తే ఒకసారే చంపేయండి. కూలీపనులు చేసుకొని ఒకసారే ఇల్లు కట్టుకోగలం..అలాంటి ఇళ్లను కూర్చేశారు. పెద్దల గెస్ట్ హౌస్లు అడ్డం రాలేదు.. మా ఇల్లులు అడ్డం వొచ్చాయా?’ అని నిలదీశారు.


