వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరూ ఆత్మహత్య
వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లెలో విషాదం
సుండుపల్లె: రెండు నెలల్లో వివాహ బంధంతో ఒక్కటి కావాల్సిన ఆ యువజంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యకు పాల్పడడంతో వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లె మండలంలో విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు, సుండుపల్లె ఎస్ఐ ఎస్కెఎం హుస్సేన్ తెలిపిన వివరాల ప్రకారం.. సుండుపల్లెకు చెందిన మొగల్ అనీషా (18) కొంతకాలంగా భాగంపల్లెలోని తన అమ్మమ్మ ఇంట్లో నివసిస్తోంది. ఆమె తల్లి ఉపాధి నిమిత్తం కువైట్లో ఉంటోంది. అనీషాకు అదే గ్రామానికి చెందిన షేక్ అస్లాం(20)తో ఏడాది క్రితమే నిశ్చితార్థం జరిగింది.
అస్లాం ప్రస్తుతం తిరుపతిలోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. అతని తండ్రి కూడా కువైట్లో ఉపాధి పొందుతున్నాడు. అనీషా, అస్లాంకు ఈ ఏడాది జూన్లో వివాహం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు. కానీ ఆదివారం సాయంత్రం అనీషా భాగంపల్లెలోని తన అమ్మమ్మ ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అస్లాం తీవ్ర మనస్తాపానికి గురై తిరుపతి సమీపంలోని చంద్రగిరి వద్ద వేగంగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
కాబోయే భార్యాభర్తలు ఇలా తనువు చాలించడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ కుమార్తె, కాబోయే అల్లుడి మధ్య ఏం జరిగిందో తమకు తెలియదని అనీషా తండ్రి జలీల్ కన్నీరుమున్నీరయ్యారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుండుపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. యువజంట మరణానికి గల కారణాలను వెలికి తీసేందుకు పోలీసులు వారి ఫోన్ కాల్డేటాను పరిశీలిస్తున్నారు.


