పొగాకు రైతుపై ఎందుకీ పగ! | Tobacco Farmers Protest For Fair Price in Bapatla district | Sakshi
Sakshi News home page

పొగాకు రైతుపై ఎందుకీ పగ!

May 27 2025 4:43 AM | Updated on May 27 2025 4:43 AM

Tobacco Farmers Protest For Fair Price in Bapatla district

ఇటీవల బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడు అడ్డరోడ్డుపై పొగాకు బేళ్లను తగులబెడుతున్న రైతులు

పొగాకు కంపెనీలకు వత్తాసు పలుకుతున్న చంద్రబాబు ప్రభుత్వం

కంపెనీలు చెప్పిన ధరలకే పొగాకు కొంటామని ప్రకటించిన మంత్రి అచ్చెన్నాయుడు 

ఆ ధరలు గిట్టుబాటు కావని రైతుల ఆందోళన 

సీజన్‌ మొదలై 75 రోజులు గడుస్తున్నా 20 శాతానికి మించని కొనుగోళ్లు 

వైఎస్‌ జగన్‌ పొదిలి వస్తున్నట్లు ప్రకటించగానే మంత్రుల హడావుడి

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొగాకు రైతులను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. గత నాలుగేళ్లు లాభాల బాటలో ఉన్న రైతులను ఒక్కసారిగా నష్టాల ఊబిలోకి నెట్టివేస్తోంది. పొగాకు సాగు కోసం ఎకరాకు రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేసిన రైతులు లాభాల సంగతి దేవుడెరుగు... కనీసం పెట్టుబడి అయినా వస్తే చాలనుకునే దుస్థితికి దిగజార్చింది.

టుబాకో కంపెనీలు, వ్యాపారులు, దళారులు అంతా కలిసి రైతులను నిండా ముంచేస్తున్నా కూటమి ప్రభుత్వం ఏమీ పట్టనట్లే వ్యవహరిస్తోంది. సీజన్‌ ప్రారంభమై 75 రోజులైనా ఇప్పటికీ 20 శాతం పొగాకును కూడా రైతుల నుంచి కొనుగోలు చేయలేదు. అయినా కంపెనీలకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వం.. రైతుల వేదనను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.  

పెట్టుబడిలో సగం కూడా రావడం లేదు..
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గతేడాది పొగాకుకు మంచి ధర పలికింది. కిలో రూ.366 వరకు అమ్ముడుపోయింది. దాంతో ఈ ఏడాది రైతులు అత్యధికంగా పొగాకు వైపు మొగ్గు చూపారు. కంపెనీలు ప్రోత్సాహించాయి.

⇒  ప్రకాశం రీజియన్‌ (ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లా)లోని 11 వేలం కేంద్రాల పరిధిలో 30వేల మందికిపైగా రైతులు పొగాకు సాగు చేశారు. ఈ ఏడాది 68,500 హెక్టార్లలో సాగుకు అనుమతివ్వడంతోపాటు కంపెనీల ప్రోత్సాహంతో పరిమితికి మించి 88వేల హెక్టార్లలో సాగు చేశారు.  

⇒ మార్చి 10న పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తొలిరోజు కిలో రూ.280 పలకడంతో పొగాకు రైతులు గట్టెక్కుతామని భావించారు.  

⇒ కొద్దిరోజులకే రైతుల అంచనాలు తలకిందులయ్యాయి. విదేశాల నుంచి ఆర్డ­ర్లు రావడంలేదని, నాణ్యతలేదని కంపెనీలు సాకులు చెప్పడం ప్రారంభించాయి. రైతులను మానసికంగా దెబ్బతీసి తక్కువ ధరలకు అమ్ముకు­నేలా వ్యూహం పన్నాయి. కూటమి ప్రభుత్వమూ పట్టించుకోలేదు. దాంతో ఇప్పు­డు నాణ్యమైన పొగాకు ధర కిలో రూ.200 కన్నా తక్కువకు పడిపోయింది.

కిలో రూ.280 దాటితేనే రైతులు గట్టెక్కుతారు
⇒ రైతులు ఎకరాకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షలవరకు ఖర్చు చేశారు.
⇒ ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల పంట దిగుబడి వచి్చంది. ఈ లెక్కన క్వింటాకు సగటున రూ.13వేల వరకు రైతులకు ఖర్చయింది.
⇒  గ్రేడ్‌–1 పొగాకు క్వింటాకు రూ.12వేలు, గ్రేడ్‌–2 రకం క్వింటాకు రూ.6వేలు చొప్పున కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
⇒ ఈ రేటుకు పంటను అమ్ముకుంటే ఒక్కో రైతు కనీసం రూ.30వేల నుంచి రూ.60 వేల వరకు నష్టపోయే అవకాశం ఉంది.

⇒ కంపెనీలు కూడబలుక్కుని ఏ రేటు అయితే మొదటి నుంచి చెబుతున్నాయో... వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా అదే రేటుకు పొగాకు కొనుగోలు చేస్తామని చిలక పలుకులు పలుకుతున్నారని రైతు సంఘాలు మండిపడుతున్నాయి.  

⇒ వేలం పాటలు మొదలై 75 రోజులు గడిచాయి. కేవలం 20శాతం పొగాకు మాత్రమే కొనుగోలు చేశారు. మిగిలిన పంటను ‘నో బిడ్‌’ అంటూ వెనక్కి పంపిస్తున్నారని రైతులు వాపోతున్నారు.  

ఆదుకున్న జగన్‌ ప్రభుత్వం 
రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.116 కోట్లను పొగాకు కొనుగోళ్లకు కేటాయించింది. పొగాకును కొనేందుకు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించింది. దాంతో మార్కెట్‌లో పోటీ వాతావరణం నెలకొంది. ఐదేళ్లూ మంచి ధరలు వచ్చాయి. రైతులు లాభపడ్డారు. గతేడాది రికార్డు స్థాయిలో కిలో 
అత్యధికంగా రూ.366కు అమ్ముడుపోయింది.

జగన్‌ పర్యటన ప్రకటనతో పాలకుల బెంబేలు 
పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 28న ప్రకాశం జిల్లా పొదిలి వస్తున్నారన్న ప్రకటన ప్రభుత్వ పెద్దలను బెంబేలెత్తించింది. నిన్నమొన్నటి వరకు పొగాకు రైతుల కష్టాలను పట్టించుకోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆఘమేఘాల మీద బాపట్ల జిల్లా మార్టూరులో పర్యటించారు.

వారికి రైతు సంఘాల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. ‘పొగాకు రైతులను కలిసి మాట్లాడేందుకు జగన్‌ వస్తున్నారు... వెంటనే పొగాకు ధరలు పెంచండి. లేకపోతే మా ప్రభుత్వం పరువు పోతుంది..’ అంటూ మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పొగాకు బోర్డు అధికారులతో మాట్లాడిన ఆడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని బట్టి వైఎస్‌ జగన్‌ పర్యటన గురించి అధికార పార్టీ నేతలు ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement