
ముగ్గురి మృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు
పరవాడ/అనకాపల్లి టౌన్ : లంకెలపాలెం ప్రధాన జంక్షన్లో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాజువాక నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న మార్కెట్ లారీ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. ఫార్మాసిటీలో విధులు ముగించుకుని వస్తున్న ఉద్యోగుల కారును ఢీకొనగా అందులో ఉన్న ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు.
అనంతరం ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా.. దానిపై ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలపాలయ్యాడు. తరువాత బొలేరా వాహనం, కంటైనర్, మరో రెండు ద్విచక్రవాహనాలను ఢీకొనగా ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో అనకాపల్లికి చెందిన కొణతాల అచ్చన్నాయుడు (52), అనకాపల్లి మండలం రేబాకకు చెందిన పచ్చికూర గాంధీ (47), అగనంపూడికి చెందిన ఫార్మా ఉద్యోగి ఎర్రప్పడు (35) ఉన్నారు.
మృతదేహాలను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రుల్లో చేర్పించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.