
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో దూసుకొస్తున్న వాయుగుండం ముప్పు ఏపీకి ఉండే అవకాశాలు చాలా తక్కువని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దక్షిణ అండమాన్ సముద్రం వరకూ విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో శుక్రవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.
ఇది క్రమంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 25 నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుందని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం ఏపీపై తక్కువగా ఉంటుందని, దక్షిణ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపుగా కదిలే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.
వాయుగుండం మరింత బలపడి తుపానుగా కూడా మారే సూచనలూ కనిపిస్తున్నాయని, దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలోని నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 26, 27 తేదీల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.