ఆడనే చంపేస్తున్నారు! | There is no surveillance on scanning centers | Sakshi
Sakshi News home page

ఆడనే చంపేస్తున్నారు!

May 15 2025 3:58 AM | Updated on May 15 2025 3:58 AM

There is no surveillance on scanning centers

యథేచ్ఛగా భ్రూణ హత్యలు 

ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్‌ 

ప్రోత్సహిస్తున్న వైద్యులు,  పలు ప్రైవేట్‌ ఆసుపత్రులు 

స్కానింగ్‌ సెంటర్లపై నిఘా శూన్యం 

తూతూ మంత్రంగా తనిఖీలు

ఒక బిడ్డకు జన్మనివ్వాలన్నది ప్రతి స్త్రీ కల. ఆ కలను సాకారం చేసుకునే క్రమంలో సంతానలేమితో బాధపడే వారి వేదన అంతా ఇంతా కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు మాత్రం కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలియగానే చేతులారా అబార్షన్‌ చేయించుకుంటున్నారు. ఆడ బిడ్డ పుడితే అత్తింటి వేధింపుల భయంతోనే కొందరు కడుపులోనే పిండాన్ని నిర్ధా్దక్షిణ్యంగా తొలగించుకుంటున్నారు. ఈ కారణంగా సమాజంలో స్త్రీ, పురుషుల నిష్పత్తిలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ఆడపిల్లలు లభించక చాలా మంది పురుషులకు వివాహాలు కాని పరిస్థితి నెలకొంది.  

కర్నూలు(హాస్పిటల్‌): ‘భ్రూణ హత్యలు వద్దు.. ఆడ పిల్లలను బతకనిద్దాం.. లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు’.. అంటూ అధికారులు పలు వేదికలపైఈ అంశంపై అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. కర్నూలు జిల్లాలో భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 240 స్కానింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకున్నవి 8, రెన్యువల్‌ కోసం వచ్చినవి మరో 15 దాకా ఉన్నాయి. వీటికి జిల్లా కమిటీ పరిశీలించి అనుమతులు జారీ చేయాల్సి ఉంది. 

అధికారికంగా ఉన్న స్కానింగ్‌ కేంద్రాలే గాక అనధికారికంగా జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల అనుమతులు లేకుండా స్కా­నింగ్‌ మిషన్లు ఏర్పాటు చేసుకుని స్కానింగ్‌ చేస్తున్నట్లు సమాచారం. వీటిలో కర్నూలుతో పాటు కోడు­మూరు, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లలో కొందరు వైద్యులు స్కానింగ్‌ ద్వారా లింగనిర్ధా్దరణ చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలిస్తే చాలు నిర్ధా్దక్షిణ్యంగా అబార్షన్‌(భ్రూణహత్య)లు చేయించుకుంటున్నారు. 

ఇందుకు సాక్ష్యంగా అప్పుడప్పుడూ కర్నూలు నగరంలోని కొత్తబస్టాండ్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల పరిసర ప్రాంతాలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని శివారు ప్రాంతాల్లో మృతశిశువులు వెలుగు చూస్తుంటాయి. ఇలా లభించిన వాటి గురించి ఏ ఒక్క అధికారి కూడా విచారణ చేసి చర్యలు తీసుకున్న దాఖలాలు ఇప్పటి వరకు జిల్లాలో నమోదు కాలేదు. అంతెందుకు గత పదేళ్లలో ఒక్క స్కానింగ్‌ కేంద్రం, వైద్యులపై కూడా స్కానింగ్‌ అక్రమాల గురించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

గత ఏప్రిల్‌ నెలలో జిల్లాలో వైద్యుల బృందం 40 స్కానింగ్‌ కేంద్రాల పరిశీలనకు వెళ్లింది. అన్ని స్కానింగ్‌ కేంద్రాల్లో రికార్డులు, రిపోర్టులు, మిషన్లు, వైద్యుల వివరాలు, గర్భిణిల వివరాలు అన్నీ సక్రమంగా ఉన్నాయని అధికారులకు రిపోర్టు ఇవ్వడం గమనార్హం. 

ఆర్‌ఎంపీలకు నజరానాలు 
జిల్లాలో డోన్, కృష్ణగిరి, ఆదోని, పత్తికొండ, కోసిగి, హొళగుంద, పెద్దతుంబళం, చిన్నతుంబళం, మంత్రాలయం, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, కౌతాళం వంటి వెనుకబడిన ప్రాంతాలే గాక తెలంగాణా, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి సైతం స్కానింగ్‌ కోసం గర్భిణులు కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరుకు వస్తుంటారు. 

ఇందులో కొందరికి అప్పటికే ఆడపిల్లలు జన్మించి ఉండటంతో మళ్లీ ఆడబిడ్డ జన్మిస్తే కుటుంబంలో పెద్దలు ఒప్పుకోరని భావించి స్కానింగ్‌లో ఆడబిడ్డ అని తేలితే అబార్షన్‌ చేయించుకోవడానికి సిద్ధపడి వస్తారు. ఈ మేరకు కర్నూలులోని కొత్తబస్టాండ్, గాయత్రి ఎస్టేట్, బుధవారపేట, ఎన్‌ఆర్‌ పేట, కోడుమూరు, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలోని కొన్ని ఆసుపత్రులు, స్కానింగ్‌ కేంద్రాలకు గర్భిణులను తీసుకొస్తారు. 

లింగ నిర్ధారణతో పాటు అవసరమైతే భ్రూణహత్య(అబార్షన్‌) చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ తతంగంలో మొత్తం సూత్రధారులు ఎక్కువగా ఆర్‌ఎంపీలే ఉంటున్నారు. లింగనిర్ధారణకు రూ.4వేల నుంచి రూ.5వేలు, అబార్షన్‌కు రూ.15వేల నుంచి రూ.20వేల దాకా తీసుకుంటున్నారు. ఇందులో ఆర్‌ఎంపీలకు 20 నుంచి 40 శాతం వరకు కమీషన్‌ ముట్టజెబుతున్నారు.  

లింగనిర్ధారణ చేస్తే జైలుకే...కానీ...! 
భ్రూణహత్యల నివారణకు కేంద్ర ప్రభుత్వం 1994లో పీసీ పీఎన్‌డీటీ యాక్ట్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం లింగనిర్ధారణ చేసినా, గర్భస్రావాలు చేయించినా ఇరువర్గాలను శిక్షించే వీలుంది. మొదటిసారి తప్పు చేస్తే మూడేళ్లు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా, రెండోసారి తప్పు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష, రూ.50వేల జరిమానా విధిస్తారు. అయితే ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా కేసు నమోదు చేసిన దాఖలాలు లేవు. 

ఈ చట్టం కింద ఏ ఒక్కరికీ శిక్ష పడదు. ఈ చట్టం ఒకటి ఉందని రోగులకు, గర్భిణిలకు తెలిసేటట్లు ఆయా స్కానింగ్‌ కేంద్రాల్లో పోస్టర్లు మాత్రం ప్రదర్శించి ఉంటాయి. కానీ కొన్నిచోట్ల అదే ప్రాంతాల్లో లింగనిర్ధారణ జరుగుతుంది. గతంలో 10 ఏళ్ల క్రితం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు  కర్నూలు, కోడుమూరు, గూడూరు ప్రాంతాల్లో స్కానింగ్‌ సెంటర్లపై దాడులు నిర్వహించి స్కానింగ్‌ మిషన్లను సీజ్‌ చేశారు. 

అయితే సీజ్‌ చేసిన మిషన్ల పక్కనే మరో మిషన్‌ను తీసుకొచ్చి లింగనిర్ధారణ చేసిన వైద్యశిఖామణులు ఉన్నారు. ఆయా ఆసుపత్రులు, స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులకు రాజకీయ నాయకుల పలుకుబడి ఉండటంతో ఇలా సీజ్‌ చేస్తే అలా తెరిపించుకునే స్థాయిలో ఉన్నారు.

తిరిగి దాడులు, తనిఖీలు నిర్వహిస్తాం 
జిల్లాలోని స్కానింగ్‌ కేంద్రాలను తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఈ మేరకు ఐదుగురు వైద్యులతో బృందాలను ఏర్పాటు చేశాం. ఈ బృందాలు గత ఏప్రిల్‌లో 40 స్కానింగ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. అయితే ఆయా కేంద్రాలను తిరిగి తనిఖీ చేసి వాస్తవ పరిస్థితులను నిగ్గు తేలుస్తాం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి పేరు, వివరాలు బహిర్గతం గాకుండా చేసి, సదరు స్కానింగ్‌ కేంద్రంపై దాడులు నిర్వహిస్తాం. రెగ్యులర్‌గా ఆసుపత్రులు, స్కానింగ్‌ కేంద్రాలపై దాడులు ముమ్మరం చేస్తాం. లింగనిర్ధారణ, అబార్షన్లు చేసే ఆసుపత్రులు, స్కానింగ్‌ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటాం.  – డాక్టర్‌ పి.శాంతికళ, డీఎంహెచ్‌వో, కర్నూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement