
సాక్షి, అనంతపురం: అనంతపురం ఎస్పీ జగదీష్ వివాదం చిక్కుకున్నారు. తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ పోలీసులు మాత్రం ఓవరాక్షన్ చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వులను అందజేసేందుకు ఎస్పీ జగదీష్ను కలిసేందుకు పెద్దారెడ్డి ప్రయత్నించినప్పటికీ ఆయన జాప్యం చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈనెల ఎనిమిదో తేదీన తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాడిపత్రికి వెళ్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాను తాడిపత్రి వెళ్తేందుకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎస్పీ జగదీష్కు ఇచ్చేందుకు పెద్దారెడ్డి అపాయింమెంట్ తీసుకున్నారు. కానీ, పెద్దారెడ్డి మాత్రం ఎస్పీ అపాయింట్మెంట్కు అనుమతి ఇవ్వలేదు. గత మూడు రోజులుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎస్పీ జగదీష్ జాప్యం చేస్తున్నారు. ఈ క్రమంలో డీఐజీ, ఎస్పీలకు వాట్సాప్ ద్వారా పెద్దారెడ్డి సమాచారం అందించారు. ఈనెల 8వ తేదీన తాడిపత్రి వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు భద్రత కల్పించాలని కోరారు. ఇక, పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత నెలకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. గత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఘర్షణల కారణంగా పెద్దారెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డిలు తాడిపత్రికి వెళ్లకూడదని నిబంధన విధించారు. అయితే, ఎన్నికల కౌంటింగ్ అనంతరం ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి వెళ్లారు. ఈ క్రమంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్టణానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు నిలువరించారు. దీంతో పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. తాడిపత్రికి వెళ్లడానికి ఇటీవల న్యాయస్థానం అనుమతించింది. ఆయనకు తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది.
మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడాన్ని జేసీ ప్రభాకర్రెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఎలాగైనా పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టనీయకూడదన్న ఉద్దేశంతో దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్రెడ్డి ఇంటి ఎదురుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆట స్థలంలో జేసీ అనుచరులు టిప్పర్లతో నాపరాళ్ల వ్యర్థాలను కుప్పలుగా వదిలారు. రాళ్లదాడి చేసేందుకే జేసీ ప్రభాకర్రెడ్డి తన అనుచరులతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని పట్టణంతో తీవ్ర చర్చ జరుగుతోంది.