
జూన్ రెండో వారంలో నివేదిక
సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు బ్రహ్మస్త్రం లాంటి పీఎస్ఎల్వీ సీ61 రాకెట్ ప్రయోగం వైఫల్యానికి గల కారణాలను తెలుసుకునేందుకు జాతీయ వైఫల్య విశ్లేషణ కమిటీ అధ్యయనం ప్రారంభించింది. ఈ ప్రయోగం ప్రారంభమైన ఏడు నిమిషాల్లోపే మూడో దశ గతి తప్పి మిషన్ కంట్రోల్ సెంటర్కు సిగ్నల్స్ కట్ అయిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. దీని వైఫల్యానికి కారణమేంటి? రాకెట్లోని మూడోదశ ఎందుకు మొరాయించింది? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఇస్రో దృష్టిసారించింది.
ఇందుకోసం జాతీయ స్థాయిలో నిపుణులతో కూడిన ఓ విశ్లేషణ కమిటీని ఏర్పాటుచేసింది. ఇది ప్రయోగం వైఫల్యంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి జూన్ రెండో వారంలో నివేదికను సమర్పిస్తుంది. ఇప్పటికే విశ్లేషణకు అవసరమైన పూర్తి డేటాను ఇస్రో ఈ కమిటీకి అందజేసింది. ఈ కమిటీ నివేదిక ఇచి్చన తరువాతే తదుపరి ప్రయోగాలపై నిర్ణయం తీసుకుంటామని ఇస్రో తెలిపింది.
నిసార్ ఉపగ్రహ ప్రయోగం జూలైకి వాయిదా..
ఇక పీఎస్ఎల్వీ సీ61 ప్రయోగం విఫలం కావడంతో ఈనెల నుంచి వరుసగా చేయాలనుకున్న అన్ని ప్రయోగాలూ వాయిదాపడ్డాయి. దీంతో జూన్ రెండు లేదా మూడో వారంలో జీఎస్ఎల్వీ ఎఫ్16 ప్రయోగం ద్వారా ఇస్రో–నాసా సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహ ప్రయోగాన్ని జూలై మూడో వారానికి వాయిదా వేసినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.