బస్సు కోసం క్యూలో వేచి ఉన్న భక్తులు
పోలీసుల ఆంక్షలతో మూడు గంటలపాటు
ఎండలో అల్లాడిన భక్తజనం
సింహాచలం (విశాఖ): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) దర్శనానికి మంగళవారం సీఎం చంద్రబాబు రావడంతో పోలీసులు అడ్డగోలు ఆంక్షలు విధించారు. దాదాపు మూడు గంటలు మండుటెండలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చంద్రబాబు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి సింహగిరికి వచ్చారు. ఆయన రావడానికి గంటన్నర ముందు నుంచే కొండపైకి వెళ్లే రెండు టోల్గేట్ల వద్ద భక్తులు, విధులకు హాజరుకావాల్సిన దేవస్థానం ఉద్యోగులను పోలీసులు నిలిపివేశారు.
ఘాట్రోడ్డులో బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలను కూడా అనుమతించకపోవడంతో దర్శనం చేసుకున్న భక్తులు సింహగిరిపై బస్టాండ్ ప్రాంగణంలోనే గంటల తరబడి వేచి ఉన్నారు. చంద్రబాబు తిరిగి వెళ్లే వరకు క్యూలైన్లలో ఉన్నవారితోపాటు ఎక్కడ వారిని అక్కడే నిలిపివేశారు. అయితే, చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత కూడా గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలగలేదు. మధ్యాహ్నం పవళింపు సేవ కావడంతో దేవస్థానం అధికారులు దర్శనాన్ని నిలిపివేశారు. చివరికి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు.


