గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం
తీవ్ర పనిభారం, ఛీత్కారాలు వేధింపులు, ఒత్తిళ్లతో నరకయాతన
అధికారపార్టీ నేతల కబంధహస్తాల్లో విధులు.. దాడులు, దాష్టీకాలకు బలవుతున్న దైన్యం
ప్రజల్లోనూ పలుచన చేసేలా సర్కారు విధానాలు.. ఆక్రోశం వెళ్లగక్కుతున్న సచివాలయ ఉద్యోగులు
గత ప్రభుత్వంలో గౌరవప్రద స్థానం
రోజూ స్పందన కార్యక్రమంతో ప్రజల్లో మర్యాద, మన్నన.. చంద్రబాబు సర్కారు వచ్చాక స్పందన కార్యక్రమం రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అయితే మరింత దారుణంగా మారింది. ఛీత్కారాలు, వేధింపులు, పనిభారంతోపాటు దాడులు, దాష్టీకాలకు బలవుతున్నారు. తాజాగా తిరుపతిలో సచివాలయ ఉద్యోగిపై జరిగిన దాడే దీనికి నిదర్శనం. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రతి సచివాలయంలో పది మంది ఉద్యోగులను నియమించారు. వారిని ప్రభుత్వ పథకాల అమలులో భాగస్వాములను చేశారు.
ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించేలా రోజూ స్పందన కార్యక్రమం సచివాలయాల్లో నిర్వహించేలా చర్యలు చేపట్టారు. దీంతో సచివాలయ ఉద్యోగులకు సమాజంలో గౌరవప్రతిష్టలు పెరిగాయి. ఆ ఐదేళ్లు పైరవీలు, పక్షపాతం, అవినీతికి తావులేకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు అందించడంతో ఉద్యోగులకు ప్రజల్లో మర్యాద పెరిగింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక స్పందన రద్దుతోపాటు సర్కారు విధానాల వల్ల ప్రజల నుంచి సచివాలయ ఉద్యోగులు ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు. అధికారపార్టీ నేతల వేధింపులకు బలవుతున్నారు.
సర్వేలు, పన్ను టార్గెట్లతో ప్రజల్లో ఆగ్రహం
చంద్రబాబు ప్రభుత్వం తరచూ సర్వేల పేరుతో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులపై పనిభారం పెంచింది. దీంతో ఇంటింటి సర్వేల కోసం సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికీ వెళ్లాల్సి వస్తోంది. అడిగిన సమాచారమే మళ్లీ మళ్లీ అడగాల్సి వస్తోంది. దీంతో ప్రజల్లో ఉద్యోగులపై చులకన భావం పెరగడంతోపాటు ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. తాజాగా పన్నుల వసూళ్లు టార్గెట్లు పెట్టి మరీ సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి పెంచడంతోపాటు వసూళ్లు చేయకపోతే సంజాయిషీలు, చర్యలు తీసుకుంటామని సర్కారు హెచ్చరికలు జారీ చేసింది.
బలవంతపు వసూళ్లకు పురిగొల్పింంది. తమపై ఉన్న ఒత్తిడితో ఉద్యోగులు పదేపదే ఇంటింటికీ వెళ్లి పన్నులు అడుగుతుండడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. తిరుపతి నగరంలో వార్డు అడ్మిని్రస్టేటివ్ సెక్రటరీపై దాడికి ఇదే కారణమని చెబుతున్నారు. సర్కారు విధానాల వల్ల ఉద్యోగులు వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసంబద్ధ ప్రశ్నలతో చికాకు..
సర్వేల పేరుతో ప్రభుత్వం రూపొందించే అసంబద్ధ ప్రశ్నలు ప్రజలకు చికాకు తెప్పిస్తున్నాయి. దీనికితోడు ప్రతిసారీ ఓటీపీలు అడుగుతుండడంతో ఇళ్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆగ్రహానికి గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు బలవుతున్నారు.
కుక్కల లెక్కలకూ వాళ్లే..
చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో కుక్కల లెక్కలూ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులతో చేయిస్తోంది. మరుగుదొడ్ల వద్ద విధులూ కేటాయిస్తోంది. ఇప్పుడు పన్ను వసూళ్ల లక్ష్యాలు విధించి వంద శాతం వసూలు చేయాల్సిందేనని రుబాబు చేస్తోంది. దీంతో పని ఒత్తిడి ఎక్కువై ఉద్యోగులు మరణిస్తున్నారు. మరోవైపు ఉద్యోగులపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో దాడులు, దాష్టీకాలకు గురవుతున్నారు. దీనికి సర్కారు విధానాలే కారణం. తిరుపతిలో వార్డు అడ్మిని్రస్టేటివ్ సెక్రటరీపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. – కాకర్ల వెంకటరామిరెడ్డి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్
ఒత్తిడి, ప్రజల వ్యతిరేకతతో..
ఉన్నతాధికారుల ఒత్తిడి, ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత మధ్య సచివాలయ ఉద్యోగులు నలిగిపోతున్నారు. తిరుపతిలో విధి నిర్వహణలో ఉన్న వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ నాగార్జునపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని చట్ట ప్రకారం శిక్షించాలి. – ఎం.డి.జానిపాషా, బి.అంకమ్మరావు, గ్రామ/వార్డు సచివాలయం ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు


