జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో కూటమికి షాక్‌ | Shock for the alliance in the GVMC standing committee elections | Sakshi
Sakshi News home page

జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో కూటమికి షాక్‌

Aug 7 2025 5:27 AM | Updated on Aug 7 2025 5:27 AM

Shock for the alliance in the GVMC standing committee elections

ఒక స్థానాన్ని దక్కించుకున్న వైఎస్సార్‌సీపీ

మేయర్‌ తీరుపై కార్పొరేటర్ల తీవ్ర వ్యతిరేకత

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో కూటమికి వైఎస్సార్‌సీపీ షాక్‌ ఇచ్చింది. కౌన్సిల్‌లో కూటమికి పూర్తి ఆధిక్యత ఉన్నా.. బుధవారం జరిగిన స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్‌తో అనూహ్యంగా ఒక స్థానాన్ని దక్కించుకుంది. పది స్థానాలకు కూటమి నుంచి 10 మంది, వైఎస్సార్‌సీపీ నుంచి 10 మంది కార్పొరేటర్లు పోటీ పడ్డారు. వాస్తవానికి కౌన్సిల్‌లో 63 మంది కార్పొరేటర్ల బలం ఉన్న కూటమికే ఈ పది స్థానా­లు దక్కడం లాంఛనమన్న అభిప్రాయాలు సర్వ­త్రా వ్యక్తమయ్యాయి. అయితే అనూహ్యంగా వైఎస్సార్‌సీపీ 24వ వార్డు కార్పొరేటర్‌ సాడి పద్మారెడ్డి 50 ఓట్లతో స్థాయీ సంఘం సభ్యురాలిగా ఎన్నికయ్యా­రు.

కూటమిపై అసంతృప్తికి నిదర్శనం
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రలో­భాలు, బెదిరింపులతో 27 మంది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను లాక్కుంది. దీంతో జీవీఎంసీలో వైఎస్సార్‌సీపీ బలం 32కు తగ్గిపోయింది. వైఎస్సార్‌­సీపీ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్‌ సీటునూ అనైతికంగా కూటమి సొంతం చేసుకుంది. అదే తరహాలో డిప్యూటీ మేయర్‌ స్థానాన్ని దక్కించుకుంది.

ఒకవైపు కూటమి ప్రభుత్వంపైనే కాకుండా మేయర్‌ పీఠాన్ని దక్కించుకున్న మూడు నెలల్లోనే జీవీఎంసీ పరిధిలో కూటమి పాలనపై వ్యతిరేకత మొదలైంది. వైఎస్సార్‌సీపీ నుంచి కూటమిలోకి వెళ్లిన కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో స్థాయీ సంఘం ఎన్నికల్లో వారు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. వైఎ­స్సార్‌సీపీ నుంచి స్టాండింగ్‌ కమిటీ సభ్యులుగా పోటీ చేసిన పది మందికి 32 ఓట్లు కంటే అధికంగా పడడమే ఇందుకు నిదర్శనం. 

వైఎస్సార్‌సీపీ విజయం..
జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్‌ సాడి పద్మారెడ్డి విజయం సాధించారు. 97 మంది కార్పొరేటర్లలో 92 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 50 మంది కార్పొరేటర్లు సాడి పద్మారెడ్డికి అనుకూలంగా ఓటు వేశారు. వాస్తవానికి జీవీఎంసీలో వైఎస్సార్‌ సీపీ బలం 32 ఉండగా.. అధికార కూటమికి చెందిన 18 మంది కార్పొరేటర్లు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించడం విశేషం. కాగా, తొలుత ఫలితం ప్రకటించలేదు వైఎస్సార్‌ సీపీ నేతలు అడిగిన తరువాతే ఫలితాన్ని ప్రకటించారు.  

Advertisement
 
Advertisement
Advertisement