ఆదోని అర్బన్: ‘ఓపెన్గా చెబుతున్నా.. నేను బిల్డింగ్ కట్టేందుకు ఆదోని కూటమి ఎమ్మెల్యే పార్థసారథి రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. రూ.10 లక్షలు ఇచ్చాను. అది కూడా భగవద్గీత, ఖురాన్, బైబిల్ సాక్షిగా ప్రమాణం చేసి పచ్చి బట్టలతో నెత్తిన పెట్టుకుని ఆయా సన్నిధిల్లో, ఎక్కడ చెప్పమంటే అక్కడ చెబుతా’ అని టీడీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకుడు సౌదీ రవూఫ్ సంచలన ఆరోపణలు చేశారు.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఎమ్మిగనూరు రోడ్డులోని ట్రెండ్స్ సమీపంలో సౌదీ రవూఫ్ భవన నిర్మాణం చేపడుతున్నారు. మున్సిపల్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారని నిర్మాణాన్ని అడ్డుకోవడంతో సౌదీ రవూఫ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే తన భవన నిర్మాణానికి అడ్డంకులు లేకుండా చూసేందుకు రూ.50 లక్షలు డిమాండ్ చేశారని, తన వద్ద అంత డబ్బు లేదని చెప్పి రెండు దఫాలుగా రూ.10 లక్షలు, మధ్యవర్తికి రూ.లక్ష ఇచ్చానని పేర్కొన్నారు.


