తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఘటన
గోకవరం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి శివారులో మంగళవారం జరిగింది. వివరాలు.. జగ్గంపేట మండలం మల్లిసాలకు చెందిన కందికట్ల ముసలయ్య, భార్య దుర్గ, కుమారుడు కందికట్ల లక్కీ (1), కుమార్తె నవ్యతో పాటు ముసలయ్య తమ్ముడు రమణకుమార్, దుర్గ సోదరి బల్లెల పద్మ (19), మరో యువకుడు కొండేపూడి వివేక్ (19) కారులో రంపచోడవరం వెళ్లారు.
మల్లిసాలకు తిరిగి వస్తున్న క్రమంలో కొత్తపల్లి దాటిన తరువాత జీడిపిక్కల ఫ్యాక్టరీ సమీపంలో కారు అదుపు తప్పి ట్రాన్స్ఫార్మర్ను, గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో వివేక్, పద్మ అక్కడికక్కడే మృతి చెందగా, ఏడాది వయసున్న లక్కీ గోకవరం ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ముసలయ్య తీవ్రంగా గాయపడగా, అతని పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గోకవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


