‘లైడర్‌’ వచ్చేస్తోంది | Rail sensor with 3D technology | Sakshi
Sakshi News home page

‘లైడర్‌’ వచ్చేస్తోంది

Oct 26 2024 4:44 AM | Updated on Oct 26 2024 4:44 AM

Rail sensor with 3D technology

రైలు ప్రమాదాలకు ఇకపై చెక్‌.. త్రీడీ టెక్నాలజీతో రైలు పట్టాల సెన్సార్‌

పట్టాలు తప్పడం, విరగడం, ఇతర ప్రమాదాలను ముందే గుర్తించే పరిజ్ఞానం 

రూ.3,200 కోట్ల ప్రాజెక్ట్‌కు రైల్వే శాఖ ఆమోదం 

రైలు ప్రమాదాల నివారణకు  రైల్వే శాఖ మరో వినూత్న ప్రాజెక్ట్‌ అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా రైళ్లు పట్టాలు తప్పి జరిగే ప్రమాదాలకు చెక్‌ పెట్టేందుకు ‘లైట్‌ డిటెక్టింగ్‌–రేంజింగ్‌ (లైడర్‌)’ టెక్నాలజీ పేరిట అధునాతన వ్యవస్థను నెలకొల్పేందుకు నిర్ణయించింది. విద్రోహ శక్తులు రైళ్లను పట్టాలు తప్పేలా చేసేందుకు కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతోంది. తొలి దశలో 1,000 రైళ్లలో రూ.1,500 కి.మీ. మేర రైల్వే ట్రాక్‌లను ఈ ప్రాజెక్ట్‌ పరిధిలోకి కేంద్రం తీసుకు వస్తోంది.  

సాక్షి, అమరావతి: రైలు ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ మరో వినూత్న ప్రాజెక్ట్‌ అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా రైళ్లు పట్టాలు తప్పి జరిగే ప్రమాదాలకు చెక్‌ పెట్టేందుకు ‘లైట్‌ డిటెక్టింగ్‌–రేంజింగ్‌ (లైడర్‌)’ టెక్నాలజీ పేరిట అధునాతన వ్యవస్థను నెలకొల్పేందుకు నిర్ణయించింది. విద్రోహ శక్తులు రైళ్లను పట్టాలు తప్పేలా చేసేందుకు కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతోంది. 

ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 24సార్లు రైళ్లను పట్టాలు తప్పించేందుకు పన్నిన కుట్రలు బట్టబయలయ్యాయి. రైలు పట్టాలను తొలగించడం, పట్టాలపై ప్రమాదకర వస్తువులను పెట్టడం వంటి దుశ్చర్యలకు విద్రోహులు పాల్పడుతున్నారు. అలాంటి కుట్రలకు చెక్‌ పెట్టేందుకు రైలు పట్టాల భద్రత కోసం రైల్వే శాఖ లైడర్‌ ప్రాజెక్ట్‌ను రూపొందించింది. 

ఇప్పటికే పట్టాలు తప్పి జరిగే ప్రమాదాల నివారణ కోసం రూ.15 వేల కోట్లతో రైలు కోచ్‌లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటుకు రైల్లే శాఖ కార్యచరణ చేపట్టింది. దానికి అదనంగా లైడర్‌ ప్రాజెక్ట్‌కు కూడా ఆమోదం తెలిపింది. ఇప్పటికే టెండర్లు పిలిచిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు సంక్లిప్తంగా...

దేశవ్యాప్తంగా విస్తరణ
లైడర్‌ టెక్నాలజీని దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరిస్తారు. మొదటి దశలో వెయ్యి రైళ్లలో రూ.1,500 కి.మీ. మేర రైల్వే ట్రాక్‌లను ఈ ప్రాజెక్ట్‌ పరిధిలోకి తీసుకొస్తారు. ఇందుకు సంబంధించి రూ.3,200 కోట్ల ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపిన రైల్వే శాఖ పనులు చేపట్టేందుకు ఇప్పటికే టెండర్లు సైతం పిలిచింది. ఈ ప్రాజక్ట్‌ను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

సెన్సార్‌ టెక్నాలజీతో..
»  లైడర్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉండే సెన్సార్‌ టెక్నాలజీ రైలు పట్టాల త్రీడీ నమూనాలను రూపొందించి లోకో పైలెట్‌ కేబిన్‌లోకి పంపిస్తుంది. 
» రైళ్లలో ఏర్పాటు చేసే సెన్సార్లు రైలు పట్టాల రియల్‌ టైమ్‌ డేటాను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఉంటాయి. 
»  రైలు పట్టాలు తప్పినా, పట్టాలు విరిగినా, పట్టాలపై చిన్న బీటలు ఉన్నా సరే వెంటనే గుర్తించవచ్చు. 
»  లేజర్‌ బీమ్‌లతో రైలు పట్టాలను సెన్సార్‌ చేసి.. ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఉంటే గుర్తించే వీలు కలుగుతుంది.
»  ఆ ప్రమాదం ఎంత దూరంలో ఉందన్నది కూడా ఈ సాంకేతికత కచ్చితంగా తెలియజేస్తుంది. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే కనీసం 15 కి.మీ. దూరంలోనే రైలును నిలిపివేసేందుకు లోకో పైలట్‌కు అవకాశం ఉంటుంది. 

Advertisement
 
Advertisement
Advertisement