సీఎండీ స్థానంలో మూడో తెలుగు వ్యక్తి
ఉక్కునగరం: ఏడాదిన్నర తర్వాత విశాఖ స్టీల్ప్లాంట్కు శాశ్వత సీఎండీ నియమితులయ్యారు. స్టీల్ప్లాంట్ సీఎండీ పోస్టు కోసం ఉక్కు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ పోస్టుకు వచ్చిన ఐదు దరఖాస్తుల్లో ఎన్ఎండీసీకి చెందిన నగర్నార్ స్టీల్ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.ఎన్.వి.ఎస్ ప్రభాకర్ను సీఎండీగా ఎంపిక చేసింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులిచ్చారు.
2024 సెప్టెంబర్లో అప్పటి సీఎండీ అతుల్ భట్ను సెలవుపై పంపి ఆ స్థానంలో సెయిల్ ఎండీ ఏకే సక్సేనాను స్టీల్ప్లాంట్ ఇన్చార్జ్ సీఎండీగా నియమించారు. ఆయన గతేడాది డిసెంబర్లో పదవీ విరమణ చేయడంతో అప్పటినుంచి సెయిల్ డైరెక్టర్ మనీష్ రాజ్ గుప్తా ఇన్చార్జ్ సీఎండీగా ఉన్నారు. ప్రభాకర్ గతేడాది ఫిబ్రవరి 21 నుంచి ఎన్ఎండీసీ స్టీల్ప్లాంట్ ఇన్చార్జ్గా కొనసాగుతున్నారు. అంతకుముందు ఆయన సెయిల్కు చెందిన రూర్కెలా స్టీల్ప్లాంట్ చీఫ్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహించారు. ప్రభాకర్ తిరుపతిలోని ఎస్వీ వర్సిటీలో బీటెక్ మెటలర్జీ పూర్తి చేశారు. వై.శివసాగరరావు, మధుసూదన్ తర్వాత ప్రభాకర్ సీఎండీగా నియమితులైన మూడో తెలుగు అధికారి.


