
సాక్షి, నెల్లూరు: పోలీసులు చుట్టుముట్టి తనతో బలవంతంగా సంతకాలు చేయించారంటూ రుస్తుం మైన్స్ అక్రమ కేసులో అరెస్టయిన బిరదవోలు శ్రీకాంత్రెడ్డి.. గూడూరు మేజిస్ట్రేట్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. రిమాండ్ రిపోర్ట్లో ఏముందో తనకు తెలియదని.. వాళ్లే రాసి సంతకం పెట్టించారన్నారు. తనకు ఆరోగ్యం కూడా బాగోలేదన్నారు. శ్రీకాంత్రెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
కాగా, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నిన్న(సోమవారం, జూలై 21) అరెస్టైన శ్రీకాంత్రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. రుస్తుం మైన్స్ అక్రమ కేసులో ఆయన్ని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై శ్రీకాంత్రెడ్డి భార్య ఆగ్రహ వ్యక్తం చేశారు.
నిన్న మధ్యాహ్నం గం. 12.30 ని.లకు ఏ సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లారని, సాయంత్రం గం. 4.15 ని.లకు అరెస్ట్ చేశామని మెసేజ్ పెట్టారని.. పోలీసులు చాలా దారుణంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులతో వైఎస్సార్సీపీ నేతల్ని వేధింపులకు గురి చేస్తోంది.