ఎస్సీ ప్రాంతాలకు రూ.3,853.93 కోట్లతో మంచినీరు  | The plan is to provide 55 liters per capita | Sakshi
Sakshi News home page

ఎస్సీ ప్రాంతాలకు రూ.3,853.93 కోట్లతో మంచినీరు 

Jun 12 2023 3:27 AM | Updated on Jun 12 2023 3:27 AM

The plan is to provide 55 liters per capita - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఎస్సీ నివాసిత ప్రాంతాల్లో మంచినీరు అందించేందుకు రూ.3,853.93 కోట్లు ఖర్చు చేస్తున్నారు. జల్‌జీవన్‌ మిషన్‌(జేఎంఎం) ద్వారా  45,13,256 మంది ఎస్సీలకు మేలు కలగనుంది. రాష్ట్రంలో జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ఎస్సీ, ఎస్టీ, మైదాన ప్రాంతాల్లో మొత్తం రూ.25,485.36 కోట్ల అంచనాతో 71,201 పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. ఎస్సీ ప్రాంతాల్లో రూ.3,853.93 కోట్లతో తొలిదశ పనులు ప్రారంభమయ్యాయి.

రాష్ట్రంలో ఎస్సీలకు చెందిన 7,917 శివారు ప్రాంతాలున్నాయి. వాటిలో 4,852 ప్రాంతాలకు సమృద్ధిగా నీరు అందుతోంది. మరో 3,065 ప్రాంతాలకు నిర్దేశించినంత (మనిíÙకి 55 లీటర్లు) నీటి సరఫరాలేదని అధికారులు అంచనా వేశారు. దీంతో ఎస్సీ ప్రాంతాల్లో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొత్తం 19,619 పనులు ప్రతిపాదించారు. నీటి ట్యాంకు (రక్షిత నీటిపథకాలు), పైపులైను వంటి నిర్మాణాలు చేపట్టనున్నారు.

ఎస్సీ నివాసిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ట్యాప్‌ కనెక్షన్‌ ఇచ్చేలా చర్యలు చేపట్టారు. 2024 నాటికి మొత్తం మూడుదశల్లో పనులు పూర్తిచేయాలని నిర్ణయించారు. ఎస్సీ కాలనీలు, ఎస్సీలు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాలు, జగనన్న కాలనీల్లో వాటర్‌ ట్యాంకులు, పైపులైన్లు, ట్యాప్‌ కనెక్షన్లు ఇచ్చే పనులు పూర్తయితే 45,13,256 మంది ఎస్సీలకు లబ్ధికలుగుతుంది.   

వేగంగా పనులు పూర్తి చేస్తాం 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల భాగస్వామ్యంతో చేపట్టిన పనుల్ని వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాం. అత్యవసరమైన రక్షిత మంచినీటి సౌకర్యాన్ని మెరుగుపరచాలనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో ఇప్పటికే పనుల పురోగతిపై సమీక్షించాం. పనులకు అడ్డంకులు లేకుండా చూడటం, వేగంగా జరిగేలా చూడటం, బిల్లుల చెల్లింపు వంటి అన్ని అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.

ప్రభుత్వం జల్‌జీవన్‌ మిషన్‌ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైదాన ప్రాంతాల్లో అవసరమైనమేరకు మంచినీటిని అందించడం కోసం కృషిచేస్తోంది. గ్రామీణ నీటిసరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) యంత్రాంగం సమన్వయంతో ప్రస్తుత వేసవిలో ఎక్కడా మంచినీటి కొరత తలెత్తకుండా చేశాం.   – మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి 

Advertisement
 
Advertisement
Advertisement