కృష్ణాజిల్లా: ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్రకు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ (ఏప్రిల్ 5న) పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ.. ‘జనసేన కార్యకర్త ఇంటిని మీరు కూల్చేస్తే మేం వెళ్లకూడదా? బాధితుడు తనకు జరిగిన కష్టం గురించి చెబితేనే నేను వెళ్లాను.
కావాలంటే నా కాల్ డేటా ఇస్తా చెక్ చేసుకో. కోర్టు తీర్పు ఉంటేనే కూల్చేశామని చెబుతున్నారు కదా... దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండి. కోర్టు తీర్పు చూపించండి... మీరు ఏం చేయమన్నా చేస్తా. కోర్టు తీర్పు ఉందని నిరూపించలేకపోతే నేను చెప్పింది మీరు చేస్తారా? మాట్లాడటానికి సిగ్గు ఉండాలి కొల్లు రవీంద్ర.
గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు కొబ్బరి తోటలో లే అవుట్ వేశారు. ఇప్పుడు మీరు మంత్రి అయ్యాకే అక్కడ బిల్డింగ్ లు కట్టారు. అక్కడ స్థలానికి, ఇళ్లకు నాకేం సంబంధం? నేను మంత్రిగా ఉన్నప్పుడు అక్రమంగా ఎవరి ఆస్తులను కూల్చలేదు. రోడ్డు విస్తరణలో కోర్టు ఆదేశాల మేరకే ఒకే ఒక్క అక్రమ బిల్డింగ్ ను అధికారులు కూల్చివేశారు.
ఇప్పుడు ప్రభుత్వం మీదే కదా... బయటికి తీయండి ఆధారాలు. నేనే ఆ బిల్డింగ్ కూల్చి వేయించినట్లు నీ దగ్గర ఆధారాలుంటే నా పై కేసు పెట్టించు. బందరుకు ఏం చేయలేదని నన్ను విమర్శిస్తున్నావు? నేను బందరు రోడ్డు విస్తరణ చేశానని నీ నోటితోనే చెబుతున్నావ్. నా బినామీల కోసమే నేను ఏదైనా చేస్తే బినామీ చట్టం ఉపయోగించండి’ అని అన్నారు.
మీకు ఆ సత్తా లేదా?
‘మీకు అధికారం ఉంది కదా... మీకు ఆ సత్తా లేదా? అందరినీ ఒప్పించి నేను బందరులో రోడ్డు విస్తరణ చేపట్టాను. 2014-19 వరకూ ఇప్పుడు రెండేళ్లలో బందరుకు మీరేం చేశారో చెప్పగలరా కొల్లు రవీంద్ర? 2004-2014 వరకు బందరు అభివృద్ధికి పాటుపడింది నేను. మీరు వచ్చాక బందరుకు ఏం చేశారో సమాధానం చెప్పండి.

బందరు కోటలో మీరు కట్టిన ఇంటికి ప్లాన్ లేదు. మార్కెట్లో కట్టిన మీ కాంప్లెక్స్కు ప్లాన్ లేదు. లక్ష్మీ టాకీస్ సెంటర్లో కట్టిన పోలీస్ కాంప్లెక్స్ కు ప్లాన్ లేదు. పోలీస్ కల్యాణ మండపానికి ప్లాన్ లేదు. నేను మాట్లాడేవన్నీ ఆన్ రికార్డు. బందరులో ప్లాన్ లేనివన్నీ వెతికిమరీ ఓ లిస్ట్ ఇస్తా. ప్లాన్లు లేనివన్నీ కొట్టేసే దమ్ముందా మీకు? అంత సీనుందా మీకు? నీకు దమ్ముంటే నా బినామీలను బయటపెట్టండి. విజయవాడ కేంద్రంగా మీరు ఆరు న్యూస్ ఛానల్స్ నడిపిస్తున్నారు’ అని అన్నారు.


