104 కాల్ సెంటర్ బలోపేతం
దాని ద్వారా సమర్ధంగా కోవిడ్ నివారణ చర్యలు
సాక్షి, అమరావతి: 104 కాల్ సెంటర్ను రాష్ట్ర ప్రభుత్వం మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దుతోంది. కోవిడ్ వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన సేవలు అందించేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు. పరీక్షలు చేయించడం దగ్గర నుంచి ఆస్పత్రిలో బెడ్ల కేటాయింపు వరకూ దీని ద్వారా సేవలను పొందేలా చేస్తున్నారు. కాల్ చేసిన వ్యక్తికి సంబంధించిన సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ డిజిటల్ పద్ధతుల్లో దాన్ని అధికారులు పర్యవేక్షించేలా ప్రోగ్రాం రూపొందించారు.
కోవిడ్ నివారణ చర్యలపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో 104 కాల్ సెంటర్ బలోపేతానికి తీసుకున్న చర్యలను అధికారులు సీఎం వైఎస్ జగన్కు వివరించారు. 104కు కాల్ చేసి కోవిడ్ టెస్ట్ సెంటర్ ఎక్కడుంది? దగ్గర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎక్కడుంది? సంబంధిత ప్రాంతంలో ఏఎన్ఎం ఎవరు? తదితర సమాచారాన్ని వెంటనే పొందవచ్చు.