ఎస్సీ కార్పొరేషన్ ఎండీ కార్యాలయం వద్ద ఎన్ఎస్ఎఫ్డీసీ లబ్దిదారుల ధర్నా
సాక్షి, అమరావతి: ఎన్ఎస్ఎఫ్డీసీ ద్వారా ఇచ్చిన ‘థాంక్యూ సీఎం సార్’ కార్లపై ఉన్న రుణాలను మాఫీ చేయాలని కోరుతూ తాడేపల్లిలోని ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) కార్యాలయం వద్ద లబ్దిదారులు ధర్నా చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఎస్సీ లబ్దిదారులు మంగళవారం ధర్నా అనంతరం తమకు రుణమాఫీ చేయాలని కోరుతూ ఎండీ కార్యాలయంలో వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక, అభివృద్ధి సంస్థ (ఎన్ఎస్ఎఫ్డీసీ), జాతీయ సఫాయి కర్మచారీస్ ఆర్థిక, అభివృద్ధి సంస్థ(ఎన్ఎస్కేఎఫ్డీసీ) ఆర్థిక సహకారంతో 2016 నుంచి 2019 మధ్య అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల కోసం ‘థాంక్యూ సీఎం సార్’ అంటూ కార్లు అందించిందన్నారు. వాటిని స్థానిక అధికారులకు అద్దెకు పెట్టుకోవాలని చెప్పారని గుర్తు చేశారు. వాస్తవానికి ఆ కార్లను అధికారులకు అద్దెకు పెట్టుకోలేదని, ఆ తర్వాత కిరాయిలు కూడా లేక అప్పులు చేసి మరీ కిస్తీలు చెల్లించామని వాపోయారు.
కిస్తీల కోసం అధికారుల వేధింపులు పెరిగాయని వాపోయారు. ఏప్రిల్ నెలాఖరులోగా బకాయిలు చెల్లించకపోతే కార్లు సీజ్ చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు రూ.వేల కోట్లు ప్రయోజనాలు కల్పిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఇచి్చన కార్లకు రుణాలు మాఫీ చేసి ఆదుకోవాలని కోరారు.


