ఆ బుక్‌లో మొదట వైఎస్‌ జగన్‌ పేరు, ఫొటో లేదు: రాచమల్లు | No Mention of Jagan in Original Book Rachamallu Siva Prasad Reddy | Sakshi
Sakshi News home page

ఆ బుక్‌లో మొదట వైఎస్‌ జగన్‌ పేరు, ఫొటో లేదు: రాచమల్లు

May 6 2026 7:40 PM | Updated on May 6 2026 8:09 PM

No Mention of Jagan in Original Book Rachamallu Siva Prasad Reddy

వైఎస్సార్‌ జిల్లా: చంద్రబాబు ఏడాదిన్నరగా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూనే ఉన్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు దాన్ని పక్కదోవ పట్టించేందుకు ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

‘జావా డిస్కవరీ డాక్యుమెంటరీ ద్వారా కొల్లం గంగిరెడ్డి అనే ఎర్ర చందనం స్మగ్లర్‌తో మా నాయకుడికి ముడిపెడుతున్నారు. తొలుత ఉడుముల సుధాకర్‌రెడ్డి రాసిన బ్లడ్‌ శాండర్స్‌ బుక్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేరు, ఫొటో లేదు. ఆ తర్వాత అదే బుక్‌ ఆధారంగా తయారైన డాక్యుమెంటరీలోనూ వైఎస్‌ జగన్‌ ప్రస్తావన లేదు.

కానీ, ఈ జావా డాక్యుమెంటరీలో మాత్రం జగన్‌కు ముడిపెడుతూ మార్ఫింగ్‌ ఫొటోలతో కథనాలు రాస్తారు. వాటిని పట్టుకుని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రెస్‌మీట్లు పెడతారు. వైఎస్‌ జగన్‌కు ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధం ఉందనే తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

కొల్లం గంగిరెడ్డి అనే వ్యక్తికి.. మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. వైఎస్సార్సీపీ ఏర్పడినప్పటి నుంచీ నేను ఉన్నా. ఏనాడూ అతడిని మా పార్టీలో చూడలేదు. సుండుపల్లికి చెందిన మహేశ్‌ నాయుడు అనే అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ ఎవరు? చెప్పలేనన్ని ఎర్రచందనం కేసుల్లో ఉన్న ఈ అంతర్జాతీయ స్మగ్లర్‌ మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాదా? 

నకిలీ స్టాంపుల నేరస్తుల నుంచి ఎర్రచందనం స్మగ్లర్లు, హత్యలు చేసిన వారు మీ చుట్టూనే తిరుగుతుంటారు. ఎమ్మెల్సీ ఒకరు మాట్లాడుతూ వివేకా కేసులో గంగిరెడ్డి, ఎర్రచందనం స్మగ్లర్‌ గంగిరెడ్డి ఒకరేనంటున్నారు. కనీస అవగాహన లేకుండా టీడీపీ ఆఫీసు ఏ స్క్రిప్ట్‌ ఇస్తే అది చదువుతూ వైఎస్‌ జగన్‌పై విషం కక్కుతున్నారు. కడపలో దస్తగిరి అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి చనిపోతే.. వివేకా కేసులో దస్తగిరి అంటారు మరో మంత్రి. 

వీళ్ల కళ్లకు బైర్లు కమ్మి... ఎక్కడ ఏది జరిగినా పేరు మ్యాచ్‌ అయితే చాలు వైఎస్‌ జగన్‌కు అంటగట్టడమేనా? పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు ఈ కొల్లం గంగిరెడ్డి ఆ పార్టీలో చేరారు. పురందేశ్వరి సాక్షిగా విజయవాడలో సమావేశాల్లో కూడా పాల్గొన్నాడు. అలా బీజేపీకి దగ్గరైన వ్యక్తిని తీసుకొచ్చి వైఎస్‌ జగన్‌కు అంటగట్టడం ఎంతవరకు సమంజసం. మీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహేశ్‌ నాయుడు అంతర్జాతీయ స్మగ్లర్‌.. అతని గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు? 

అనేక హత్యలు, కుంభకోణాలతో సంబంధం ఉన్న వ్యక్తులు వందల సంఖ్యలో చంద్రబాబు చుట్టూ ఉన్నారు. వారి గురించి మాట్లాడటానికి మీకు నోరు రావడం లేదా? అసలు మొదటి డాక్యుమెంటరీలో లేని వైఎస్‌ జగన్‌ పేరు, ఫొటో రెండో డాక్యుమెంటరీలోకి ఎలా వచ్చింది? 

డాక్యుమెంటరీకి మూలమైన బ్లడ్‌ శాండర్స్‌ బుక్‌లో నేను వైఎస్‌ జగన్‌ ప్రస్తావనే తీసుకురాలేదని రచయిత సుధాకర్‌రెడ్డి చెబుతున్నారు. తన రచనను ఉపయోగించి తయారుచేసిన డాక్యుమెంటరీలో తప్పుడు సమాచారం పెట్టారని రచయిత లీగల్‌ నోటీసులు కూడా పంపారు. ఇదంతా చూస్తే ఈ పచ్చ మూక ఎంత బరితెగించిందో ప్రజలకు అర్ధం అవుతోంది. మా పార్టీ నుంచి కూడా తప్పుడు కథనాలపై న్యాయపరమైన చర్యలకు దిగుతాం’ అని చెప్పారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement