శ్రీశైలంలో పూడిక నష్టం 102.11 టీఎంసీలు | Mud accumulating in Srisailanjala reservoir | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో పూడిక నష్టం 102.11 టీఎంసీలు

Dec 23 2024 4:21 AM | Updated on Dec 23 2024 4:21 AM

Mud accumulating in Srisailanjala reservoir

జలాశయంలో పేరుకుపోతున్న మట్టి

సీడబ్ల్యూసీ నివేదిక వెల్లడి

జలాశయం నిర్మాణం పూర్తయ్యాక 1976లో తొలిసారిగా నీటినిల్వ

అప్పట్లో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలుగా నిర్ధారణ

తాజా సర్వేలో 205.95 టీఎంసీలకు తగ్గిన నీటినిల్వ సామర్థ్యం

సాక్షి, అమరావతి: కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం జలాశయంలో పూడిక పేరుకుపోతుండటంతో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గింది. లైవ్‌ స్టోరేజి సామర్థ్యం 72.77 టీఎంసీలు, డెడ్‌ స్టోరేజీ సామర్థ్యం 29.33 టీఎంసీలు తగ్గిందని రాష్ట్ర జల వనరుల శాఖ, కేంద్ర జలసంఘం (సీడ­బ్ల్యూసీ) సంయుక్తంగా రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నా­లజీని ఉపయోగించుకుని నిర్వహించిన హైడ్రో­గ్రాఫిక్‌ సర్వేలో వెల్లడైంది. 

బేసిన్‌లో పెద్దఎత్తున అడవులను నరికివేస్తుండటంతో వర్షాలు కురిసినప్పుడు భూమి భారీగా కోతకు గురువుతుండటం.. వరదతోపాటు భూమి కోతకు గురవడం వల్ల వచ్చే మట్టి కలిసి ప్రవహిస్తూ జలా­శయంలోకి చేరుతోంది. ఏటా పూడిక పేరుకుపోతుండటం వల్లే శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిందని సీడబ్ల్యూసీ తేల్చింది. 

దేశంలో జలాశయాల్లో పేరుకుపోతున్న పూడికపై 1991, 2001, 2015, 2020లలో సీడబ్ల్యూసీ సర్వేచేసి.. నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ ఏడాది దేశంలోని 548 జలాశయాల్లో నీటినిల్వ సామర్థ్యంపై సర్వే చేసింది. పెద్దఎత్తున పూడిక పేరుపోవడం వల్ల నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిన జలాశయాల్లో శ్రీశైలం మొదటి స్థానంలో నిలిచింది.



45 ఏళ్లలో కొండలా పూడిక
కృష్ణా నదిపై నంద్యాల జిల్లా శ్రీశైలం సమీ­పంలో 1960లో జలాశయం నిర్మా­ణాన్ని ప్రా­రంభించారు. 1976 నాటికి పూర్తి చేశా­రు. జలాశయంలో నీటినిల్వను 1976 నుంచే ప్రారంభించారు. అప్పట్లో రాష్ట్ర జల­వనరుల శాఖ నిర్వహించిన సర్వేలో జలా­శయంలో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలు కాగా.. సాగు, తాగునీటి అవస­రాల కోసం ఏటా 253.05 టీఎంసీలను వినియోగించుకోచ్చని తేల్చింది.

జలాశయంలో పూడిక పేరుకు­పో­తుండటం వల్ల ఏటా నీటినిల్వ సామర్థ్యం తగ్గు­తూ వస్తోంది. సీడబ్ల్యూసీ, రాష్ట్ర జల వనరుల శాఖ తా­జా­గా నిర్వహించిన సర్వేలో శ్రీశైలం గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 205.95 టీఎంసీలుగా తేలింది. అంటే.. 45 ఏళ్లలో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గినట్టు స్పష్టమ­వుతోంది. జలా­శయంలో పూడిక కొండలా పేరుకు­పోవడం వల్లే ఆ స్థాయిలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిందన్నది స్పష్టమవుతోంది.

ఆయకట్టుకు నీళ్లందించడం సవాలే
శ్రీశైలం జలాశయంపై ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు గంగ, ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలు­వ), గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలంగాణ­లో కల్వకుర్తి ఎత్తిపోతలు ఆధారపడ్డాయి. పూ­డి­క వల్ల శ్రీశైలం గరిష్ట నీటినిల్వ సామర్థ్యం, లైవ్‌ స్టోరేజి సామర్థ్యం భారీగా తగ్గిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారుతుందని నీటి పారు­దలరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తు­న్నారు. 

కొండలా మారిన పూడికను తొలగించ­డం భారీ వ్యయంతో కూడిన పని అని, పూడిక తొలగింపు అసాధ్యమని తేల్చిచె­బుతున్నారు. తగ్గిన నీటినిల్వ సామర్థ్యం మేరకు కొత్తగా రిజర్వాయర్‌ నిర్మించే అవకా­శాలను పరిశీలించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.  

శ్రీశైలం రిజర్వాయర్‌ సమగ్ర స్వరూపం
తొలిసారి రిజర్వాయర్‌ను నింపింది: 1976
గరిష్ట నీటిమట్టం 885 అడుగులు
క్యాచ్‌మెంట్‌ ఏరియా: 60,350 చ.కి.మీ.
గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు నీరు నిల్వ ఉండే ప్రాంతం 615.18 చ.కి.మీ. 

Advertisement
 
Advertisement
Advertisement