ఎన్టీఆర్ జిల్లా: కీసర టోల్గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్గేటు దాటే సమయంలో బీఎండబ్ల్యూ కారు (టీఎస్09ఎఫ్టీ662)పై ట్యాంకర్ పడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి, వారి పరిస్థితి విషమంగా మారింది.
కారుపై పడిన ట్యాంకర్ను తొలగించేందుకు రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారీ క్రెయిన్ సహాయంతో కారుపై పడిన ట్యాంకర్ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో ప్రమాదానికి గురైన కారు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. కారు హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడాకు చెందిన శ్రీనివాసరావుదిగా పోలీసులు గుర్తించారు. ట్యాంకర్ ఏపీ రిజిస్ట్రేషన్ పేరుతో తమిళనాడులో ఎక్కువగా తిరుగుతున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం తరువాత పరారీలో ఉన్న ట్యాంకర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


