
కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీనికి అనుబంధంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు గరిష్టంగా 60 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఈ నెల 18 వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
కళింగపట్నం, భీమిలి, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడిచిన 24 గంటల్లో పెందుర్తిలో 87.5 మి.మీ, వేపగుంటలో 74 మి.మీ, జియ్యమ్మవలసలో 67మి.మీ, కురుపాంలో 60మి.మీ వర్షపాతం నమోదైంది.