బాత్రూం డోర్‌ కొట్టిందని మోకాళ్లపై కూర్చోబెట్టిన టీచర్‌ | Teacher Punishes Student For Knocking On Bathroom Door, Education Department Negligence Fail To Act On Complaint | Sakshi
Sakshi News home page

బాత్రూం డోర్‌ కొట్టిందని మోకాళ్లపై కూర్చోబెట్టిన టీచర్‌

Dec 16 2025 1:12 PM | Updated on Dec 16 2025 1:29 PM

guntur school student punishment education department negligence

గుంటూరు: మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని టాయిలెట్‌కు వెళ్లేందుకు బాత్రూం డోర్‌ కొట్టిందని మోకాళ్లపై కూర్చోబెట్టిన సంఘటనపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖాధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గత నెల 17న జిల్లా కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌లో ఇచ్చిన ఫిర్యాదుకు దిక్కు లేకుండా పోయింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదును పరిష్కరించినట్లుగా పేర్కొంటూ క్లోజ్‌ చేయడంతో తిరిగి విద్యార్థిని తల్లిదండ్రులు సోమవారం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. 

గుంటూరు నగరం పట్టాభిపురంలోని జీకేఆర్‌ హైస్కూల్ ల్లో 3వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అర్జంటుగా టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడంతో పాఠశాలలోని బాత్రూంకు వెళ్లింది. అయితే బాత్రూం ఖాళీ లేకపోవడంతో లోపల ఉన్న వారిని త్వరగా బయటకు రావాలని పిలిచేందుకు తలుపు తట్టింది. ఈ సంఘటన గమనించిన పాఠశాలలోని ఒక టీచర్‌ విద్యారి్థని పెద్ద తప్పిదం చేసినట్లుగా భావించి, చెంపపై దెబ్బ కొట్టడంతోపాటు మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఈ విధంగా గంటన్నర సేపు విద్యారి్థని మోకాళ్లపై కూర్చునట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనంతరం జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తల్లిదండ్రులతో పాఠశాల యాజమాన్యం వాగ్వాదానికి దిగింది. బాలిక తల్లి సంకు త్రిలోచనకు ముగ్గురు పిల్లలు కాగా, ఇదే పాఠశాలలో చదువుతున్నారు. 

ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు నుంచి వారిని పాఠశాలకు రానివ్వకుండా యాజమాన్యం అడ్డుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరపాల్సిన విద్యాశాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. క్షేత్రస్థాయిలో పాఠశాలకు వెళ్లి విచారణ జరపాల్సిన అధికారులు ఇవేమీ చేయకుండానే ఫిర్యాదు పరిష్కరించామని చెప్పి ఫిర్యాదును మూసివేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో తల్లిదండ్రులు మళ్లీ ఫిర్యాదు చేసేందుకు సోమవారం గ్రీవెన్స్‌కు వచ్చారు. గ్రీవెన్స్‌లో ఇచ్చిన ఫిర్యాదును పరిష్కరించినట్లుగా జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీం బాషా పేరుతో సంబంధిత విద్యార్థిని తల్లికి పోస్టులో లేఖ పంపారు. విద్యారి్థని తల్లిదండ్రులు ఇచ్చిన సెల్‌ఫోన్‌కు పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదని లేఖలో పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement