ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వొద్దు: వైఎస్‌ జగన్‌ కీలక సూచనలు | Expose Alliance Govts Failures ys Jagan Tells Party Workers | Sakshi
Sakshi News home page

ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వొద్దు: వైఎస్‌ జగన్‌ కీలక సూచనలు

Sep 1 2026 6:04 PM | Updated on Sep 1 2026 6:34 PM

Expose Alliance Govts Failures ys Jagan Tells Party Workers

పులివెందుల: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పులివెందుల పర్యటన కొనసాగుతోంది. భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్‌ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులను వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను ఓపికగా విన్న ఆయన, పార్టీ నాయకులతో కూడా మాట్లాడారు.

స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు వైఎస్‌ జగన్‌ పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోవాలని అన్నారు. ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి స్థానంలో పోటీకి సిద్ధం కావాలన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి 
‘‘వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రజలకు జరిగిన మేలును ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలి. ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలి.  పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేసుకుని, గ్రామాలు, వార్డుల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలి. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షంపై ఒత్తిళ్లు తీసుకురావడం, పోలీసులను ఉపయోగించి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడే ప్రయత్నాలు జరిగితే వాటిని ధైర్యంగా, సంఘటితంగా ఎదుర్కోవాలి.

కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్‌ వ్యవస్థ, నాడు–నేడు, ఆరోగ్యశ్రీ విస్తరణ, విద్యా రంగంలో సంస్కరణలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 

ప్రజల మధ్యే ఉండాలి... వారి సమస్యలపై పోరాడాలి... వైఎస్సార్‌సీపీ పాలనలో వారికి జరిగిన మంచిని గుర్తుచేయాలి. అలా చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం కష్టం కాదు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం కొనసాగించాలి. పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సిద్ధం కావాలి. గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేసి, ప్రజల విశ్వాసాన్ని మరింతగా పొందేలా ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా పనిచేయాలి’’ అని వైఎస్‌ జగన్‌ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement